Saturday, April 27, 2024

‘వాల్తేరు వీరయ్య’ విజయం సమిష్టి కృషి: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మెగా మాస్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “ఈ చిత్రం కోసం టీం అందరితో కలసి సమిష్టి కృషి చేస్తే బ్లాక్‌బస్టర్ అయి తీరుతుందనే నమ్మకంతో పనిచేశాం.

మేము ఏదైతే అనుకున్నామో అది నెరవేరిన తర్వాత ఒక్కసారిగా మాటలు కొరవడిపోయాయి. ఈ సమయంలో మేము మాట్లాడటం ఆపేసి ప్రేక్షకులు చెబితే వినాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ప్రేక్షకుల స్పందననే మా ఇంధనం. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక సినిమా అద్భుతంగా వస్తుందం దానికి కారణం ఆ సినిమాకి పని చేసే కార్మికులు. ‘వాల్తేరు వీరయ్య’ విజయం సినిమాకు పని చేసిన కార్మికులది. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు, అభినందనలు. రవితేజ, బాబీ, దేవిశ్రీ, నిర్మాతలు రవి, నవీన్ , మిగతా నటీనటులు… ఇలాంటి అద్భుతమైన టీమ్ తో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. ‘వాల్తేరు వీరయ్య’ విజయం సమిష్టి కృషి. సినిమా ఇంత గ్రాండ్‌గా చేయడం మైత్రీ మూవీ మేకర్స్ వల్లనే సాధ్యమైంది. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. వారితో మళ్ళీ కలసి పని చేయాలని వుంది. దర్శకుడు బాబీ ఈ కథని అద్భుతంగా మలిచారు. సినిమాని చాలా ప్లానింగ్‌తో పర్ఫెక్ట్‌గా తీశాడు.

అందుకే నిర్మాతలకు ఎలాంటి భారం లేకుండా సజావుగా సాగింది. ఈ రోజు అంద రు దర్శకులు విజయం కావడం కంటే నిర్మాత బడ్జెట్ కి సిని మా తీయడం మొదటి సక్సెస్ గా భావించాలి. దర్శకులే నిర్మాతలని బ్రతికించాలి. పక్కా పేపర్ వర్క్ చేయాలి. నిర్మాతలు ఉంటేనే నటీనటులు బావుంటారు. నా తమ్ముడు రవితేజ లేకపోతే సెకండ్ హాఫ్ లో ఇంత అందం వచ్చేది కాదు. ఇందులో గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వస్తున్నాయని మా డివోపీ విలన్స్ అన్నారు. ఎదురుగా వున్నది నా తమ్ముడని చెప్పా. రవితేజ లేకపోతే ఆ ఎమోషన్ వచ్చేది కాదు. దేవిశ్రీ తన మ్యూజిక్ తో పూనకాలు తెప్పించాడు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఆర్థర్ విలన్స్ అందరూ అద్భుతంగా పని చేశారు. మంచి కంటెంట్ ఇస్తే ఆదరించి ప్రేక్షకులే తిరిగి థాంక్స్ చెబుతారని ‘వాల్తేరు వీరయ్య’ నిరూపించింది”అని అన్నారు.

రవితేజ మాట్లాడుతూ “అన్నయ్య చిరంజీవితో ఇంతకుముందు రెండు సినిమాలు చేశాను. కానీ ‘వాల్తేరు వీరయ్య’ సందడి వేరు. సినిమా చూసి వచ్చిన చిన్న పిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు. అంత గొప్పగా కనెక్ట్ అయింది. దర్శకుడు బాబీకి బిగ్ కంగ్రా ట్స్. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఆర్థర్ విలన్స్, చంద్రబోస్.. అందరికీ కంగ్రాట్స్. దేవిశ్రీ మ్యూజిక్‌తో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళారు. ఆయనకి థాంక్స్. మా నిర్మాతలు రవి, నవీన్‌లకి బిగ్ కంగ్రాట్స్‌”అని చెప్పారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ “వాల్తేరు వీరయ్య చూసిన ప్రేక్షకులు ‘మా చిరంజీవిని మాకు ఇచ్చావ్ అన్నా’ అన్నారు. ఒక అభిమాని అయిన దర్శకుడుకి ఇంతకంటే గొప్ప సక్సెస్ ఏం కావా లి. చిరంజీవి, రవితేజ ఎమోషనల్ సీన్స్‌కి క్లాప్స్ కొడుతున్నారు.

ఇంత గొప్ప మ్యాజిక్ జరగడానికి వారి మధ్య వున్న ప్రేమ, వాత్సల్యం కారణం. ఈ సినిమా ఇంత గొప్పగా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌కి కృతజ్ఞతలు. శ్రుతి హాసన్, కేథరిన్, ప్రకాష్ రాజ్ అందరూ అద్భుతంగా చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పూనకాలు లోడింగ్ లాంటి యాక్షన్ ఇచ్చారు. అలాగే పీటర్ మాస్టర్ సముద్రంలో డిజైన చేసిన యాక్షన్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఒక సినిమాని ప్రేమతో చేస్తే ఫలితం ఎంతగొప్పగా వుంటుందో ‘వాల్తేరు వీరయ్య’తో నిరూపించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, దేవిశ్రీ ప్రసాద్, ఏఎస్ ప్రకాష్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఆర్థర్ విలన్స్, నిరంజన్, చంద్రబోస్, శ్రీనివాస్ రెడ్డి, రోల్ రిడ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News