Friday, April 26, 2024

కరోనాతో యుద్ధం జీవిత కాల సవాలు

- Advertisement -
- Advertisement -

PM Modi

 

మీటరు దూరంనుంచి ఇంటర్వూ చేయండి
మీడియాకు ప్రధాని సూచన
విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న మీడియాకు కృతజ్ఞతలు

న్యూఢిల్లీ: కోవిడ్19తో యుద్ధం జీవితకాల సవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సరికొత్త సృజనాత్మక పరిష్కారాలతో ఈ మహమ్మారిని కట్టడి చేయాలని మీడియా ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే కరోనా మహమ్మారికి దేశవ్యాప్తంగా ఏడుగురు చనిపోగా, సోమవారం మధ్యాహ్నానికి పాజిటివ్ కేసుల సంఖ్య 415కు చేరుకున్న విషయం తెలిసిందే. ‘పాత్రికేయులు, కెమెరా పర్సన్స్, సాంకేతిక నిపుణులు దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్నారు. సానుకూల భావ ప్రసారంతో మీడియా నిరాశావాదం, భయాన్ని తరిమి కొట్టాలి. కోవిడ్19 జీవితకాల సవాల్. వినూత్న, సృజనాత్మక పరిష్కారాలతో దాన్ని తరిమి కొట్టాలి’ అని మోడీ అన్నారు. కరోనా ఎంత ప్రమాదకారో అర్థం చేసుకొని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

‘ఒక సుదీర్ఘ యుద్ధం మన ముందుంది. ప్రజలకు అర్థమయ్యే సులభ భాషలో సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) ఎంత ముఖ్యమో మీడియా తెలియజేయాలి. కీలక నిర్ణయాలు, తాజా విషయాలను వివరించాలి’ అని అన్నారు. మీడియా ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తుందని, వాటి ఆధారంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రధాని అన్నారు. మీడియా సంస్థలు పాత్రికేయులకు ప్రత్యేకమైన మైకులు ఇవ్వాలని సూచించారు. ముఖాముఖి ఇంటర్వూలు చేసేటప్పుడు కనీసం మీటరు దూరం ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. శాస్త్రీయ నివేదికలనే మీడియా ప్రసారం చేయాలని సూచించారు.

అవగాహన కలిగిన నిపుణులనే చర్చల్లో భాగస్వాములను చేసి అసత్యాలు వ్యాపించకుండా చూడాలన్నారు. పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తరచూ జాతినుద్దేశించి ప్రసంగిస్తే బాగుంటుందని మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా మోడీకి సూచించారు. పాత్రికేయులను పరీక్షించేందుకు 24 గంటలు పని చేసే వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రసార భారతి రోజుకు రెండు సార్లు సరైన వివరాలు అందిస్తే అన్ని చానళ్లు వాటినే ప్రసారం చేయగలవని సూచించారు. విలువైన సలహాలు ఇచ్చిన మీడియా ప్రతినిధులకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు.

 

War with Kovid 19 is a lifelong revival
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News