Monday, May 6, 2024

రైతు చెంతకే కొనుగోలు కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

SINGIREDDY NIRANJANREDDY

 

రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీకి ప్రభుత్వం అనుమతి
లాక్‌డౌన్ ఆంక్షలకు విఘాతం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు
నిత్యావసరాలు ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు
అధిక ధరలకు నిత్యావసర సరకులు అమ్మితే కఠిన చర్యలు
విత్తనాలు, ఫర్టిలైజర్ రవాణా, సరఫరాపై ఆంక్షలు లేవు
మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు
మీడియాతో మంత్రి నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దానిని అరికడుతూనే రైతులకు అసౌకర్యం కలగకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి , పట్టణాలు, గ్రామాలకు వచ్చే పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ట్రాఫిక్ జామ్ కారణంగా ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టోల్ ప్లాజాలు చెక్ పోస్ట్‌ల వద్ద అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, హెచ్చరించారు. దీనిని అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విత్తనాలు, ఫర్టిలైజర్ ఇ.సి యాక్ట్ లో ఉన్నందున వాటి రవాణా, సరఫరా పై ఎటువంటి ఆంక్షలుండవన్నారు. -సిఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ లాక్ డౌన్ ఆంక్షలకు విఘాతం కలగకుండా ధాన్యం కొనుగోళ్లకు తీసుకోవాల్సిన చర్యలపై బిఆర్‌కెఆర్ భవన్‌లో పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి నిరంజన్ రెడ్డి సమీక్షించారు.

అనంతరం ఆయన హాకా భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో పరిమితులు అవసరం లేదన్నారు. -గ్రామాల రైతులు పట్టణ మార్కెట్ల వరకూ రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, విధిగా ఏ గ్రామ రైతు ఆ గ్రామంలోనే ధాన్యం అమ్మకాలు చేసుకునే అవకాశం అధికారులు కల్పించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.25 వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీకై ఆర్థిక శాఖకు సిఎం ఆదేశాలిచ్చారన్నారు. అలాగే రబీలో పండిన మొక్కజొన్నలను రూ.1760కు కొనుగోలు చేయాలని సిఎం స్పష్టం చేశారని, పౌల్ట్రీ సంక్షోభం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ మంది రైతులు గుమికూడకుండా చూడాలన్నారు. గ్రామాల వారీగా ధా న్యం అమ్మకానికి వచ్చే పరిస్థితులు అంచనా వేసి కొనుగోళ్లకు టోకెన్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలన్నారు.

కొత్తగా 60 వేల టార్ఫాలిన్లు
ఆకాల వర్షాలు వస్తే కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది లేకుండా టార్పాలిన్ల సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ రబీలో 38.19 లక్షల ఎకరాలలో ఈసారి వరి సాగు చేశారని, ప్రతి ఏటా ధాన్యం దిగుబడులు పెరుగుతాయి తప్ప తగ్గే పరిస్థితి లేదన్నారు. కొత్తగా 60 వేల టార్పాలిన్లను త్వరగా కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖకు ఆదేశాలిచ్చారు. వచ్చే నెల 15 వరకు అన్నీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. -సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య పలువురు ఉన్నతాధికారులు పాల్గన్నారు.

 

Establishment of grain buying centers in villages
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News