హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. గన్పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర సిఎం నివాళులర్పించారు. ప్రగతి భవన్లో జాతీయ పతాకాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో, ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, తెలంగాణ ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం దారుణంగా ఉండేదని గుర్తు చేశారు. నేడు తెలంగాణలో వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందని ప్రశంసించారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, నేడు మిషన్ భగీరథతో నీటి సమస్య పరిష్కారమైందని కెసిఆర్ కొనియాడారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటి తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామన్నారు. తెలంగాణ ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైందని, తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పునరంకితమవుతోందని కెసిఆర్ స్పష్టం చేశారు.