Friday, May 3, 2024

సాగర్‌కు పోటెత్తుతున్న వరదనీరు

- Advertisement -
- Advertisement -

సాయంత్రానికి 10 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయంలో 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
శ్రీశైలం జలాశయం వద్దకు భారీగా సందర్శకులు

Water released from Nagarjuna sagar project

మనతెలంగాణ/హైదరాబాద్:  శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 5,04,086 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలం జలాశంయ పూర్తి నీటి నిల్వ 215.80 టిఎంసీలు కాగా జలాశయంలో 207.41 టిఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి జలాశయానికి వరద వస్తుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే సాగర్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు 10 గేట్లను అధికారులు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు.
పెరిగిన సందర్శకుల తాకిడి
శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు జలాశయం వద్దకు చేరుకుంటున్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న భక్తులు హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. శ్రీశైలం-హైదరాబాద్ రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఘాట్ రోడ్డుపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
ఎడమ కాల్వకు నీరు విడుదల
నాగార్జున సాగర్ జలాశయం ఇన్ ఫ్లో 5,14,526 క్యూసెక్కులు ఉండగా, లక్ష క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 585 అడుగులు మేర నీరు చేరింది. జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 312.04 టిఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 280.69 టిఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్‌కు వరద నీరు వస్తుండటంలో సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. వానాకాలం సాగు కోసం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. ఎంపి బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే నోముల భగత్ ఎడమ కాల్వకు గేట్లు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గతేడాది ఆగష్టు 11వ తేదీన సాగు నీటిని ఎడమకాలువకు విడుదల చేయగా, ఈసారి 10 రోజుల ముందుగా నీటిని విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గంట గంటకు జలాశయంలోకి వరద ఉద్ధృతి పెరుగుతున్నందున 10 సాగర్ గేట్లను అధికారులు ఎత్తారు. ఈ మేరకు ఎన్‌ఎన్‌పి అధికారులు మధ్యాహ్నాం క్రస్ట్ గేట్లను పరిశీలించారు.
ప్రకాశం బ్యారేజీకి 35,526 క్యూసెక్కుల వరద నీరు
ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీకి 35,526 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. బ్యారేజీ 36 గేట్లు అడుగు మేర ఎత్తి 26,892 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాటిలో 8,634 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి కాలువలకు వదులుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News