Thursday, May 9, 2024

రెండు గ్యారంటీల అమలు

- Advertisement -
- Advertisement -

బడ్జెట్‌లో వాటికి సరిపడ నిధుల కేటాయింపులు
అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు
ఒక్క అర్హుడికీ నష్టం జరగకుండా అధికారులు చూడాలి
ప్రజా పాలన దరఖాస్తుల సమీక్షలో సిఎం. రేవంత్ రెడ్డి… అధికారులకు ఆదేశాలు!

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నఅర్హులందరికీ లబ్ధి చేకూరేలా గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుందని, ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్ లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాలోపు మరోసారి కేబినేట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఈ గ్యారంటీలకు మొత్తం 1,09,01,255 దరఖాస్తులు ప్రజలు అందజేశారని, జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు నివేదించినట్లు చెప్పారు.
వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని అధికారులు వివరించారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని అధికారులకు సూచించారు.

అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండు సార్లు సరి చూడాలని కోరారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీవో కార్యాలయాల్లో తదుపరి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్యారంటీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలన్నారు. దరఖాస్తు చేయని వారుంటే నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి రవి గుప్తా, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, పౌరసరఫరాల కమిషనర్ డిఎస్ చౌహన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్, జిహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్ద్ రాస్, హోం శాఖ సెక్రటరీ జితేందర్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తదితర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News