Wednesday, May 1, 2024

బెంగాల్ మార్పును కోరుకుంటోందా?

- Advertisement -
- Advertisement -

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలు రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ రణరంగంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ప్రశ్నార్థకమే. కేంద్ర హోంమంత్రి అపర చాణిక్యుడు అమిత్ షా గత రెండు రోజులుగా బెంగాల్ లో పర్యటించారు. మొదటి రోజు బెంగాల్లోని పది మంది ప్రస్తుత ఎంఎల్‌ఎలు, ఒక మంత్రి, ఒక ఎంపి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. ఇందులో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత మంత్రి సువేందు అధికారితో పాటు, బర్ధమాన్ తూర్పు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న టిఎంసి సిట్టింగ్ ఎంపి సునీల్ మండల్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి పార్టీలోకి ఫిరాయించిన పది మంది ఎంఎల్‌ఎలలో ఆరుగురు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారు కావడం విశేషం. వారితో పాటు మరో నలుగురు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల ఎంఎల్‌ఎలు కావడం కూడా మరో విశేషం.

రాష్ట్రంలోని అన్ని పార్టీలను విడవకుండా ఎడాపెడా ఫిరాయింపులు ప్రోత్సహించి ఎన్నికలకు ముందు బిజెపి తమ రాజకీయ పునాదిని పటిష్ఠ పరుచుకుంది. రెండవ రోజు కూడా అమిత్ షా బెంగాల్‌లో పర్యటిస్తూ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న హింసను ప్రస్తావించారు. గత పదేళ్లుగా బిజెపి పార్టీకి చెందిన మూడు వందల మంది కార్యకర్తలను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హత్య చేశారని ఆయన ఆరోపించారు. బెంగాల్ హింసా రాజకీయాలను ప్రస్తావిస్తూ ఇటీవల తమ పార్టీ అధ్యక్షుడైన జెపి నడ్డా పైన దాడిని కూడా ఆయన ప్రస్తావించారు. ఇలాంటి హింసా రాజకీయాలకు ఇకముందు చరమగీతం పాడతామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా ఖాళీ అయిపోయి రేపటి ఎన్నికల్లో ‘దీది’గా పిలవబడే మమతా బెనర్జీ ఒక్కరే తన పార్టీలో ఒంటరిగా మిగిలిపోతారని ఆయన ఎద్దేవా చేశారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 200 కు పైగా అసెంబ్లీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తామని ఆయన తేల్చి పారేశారు.

బెంగాల్‌లో ఒక వంక బిజెపి పార్టీ బలం పుంజుకుంటుంటే మరో వైపు నుంచి హైదరాబాదీ పార్టీగా పేరుగాంచిన అసదుద్దీన్ ఓవైసి ఆధ్వర్యంలోని ఎంఐఎం పార్టీ బెంగాల్ రాజకీయాల్లో ప్రవేశిస్తుంది. దీనికి బలమైన కారణం ఉంది. బిజెపికి ఎంఐఎం ‘బి’ టీంగా వ్యవహరిస్తుందని ఇప్పటికే అన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బిజెపి, ఎంఐఎం ఇద్దరూ ఎన్నికల్లో పోటీ చేసి ఆయా మతాలను రెచ్చగొట్టి లాభం పొందుతున్నాయని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు సీట్ల గెలుపుతో కొంతవరకు నిజమే అనిపిస్తుంది.

ఓటర్ల విషయానికి వస్తే బెంగాల్ ఓటర్లలోలో సుమారు ముప్పై శాతం పైగా ముస్లింలు ఉన్నారు. వందకు పైగా నియోజకవర్గాలలో వీరి ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ దశలో బిజెపి ఎంఐఎం, మతతత్వ రాజకీయాలు ఓటర్ల ‘పోలరైజేషన్’ కు దారి తీస్తుందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ పుట్టిన హైదరాబాద్ నుండి పక్కనే ఉన్న కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాజకీయాల్లో ఇప్పటికే రంగ ప్రవేశం చేసింది. కొంత వరకు సక్సెస్ కూడా అయ్యింది. అదే ఒరవడిలో పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దేశ రాజకీయాల్లో పెను మార్పులకు ఇది మరొక సంకేతంగా మారింది.

స్వాతంత్య్రానంతరం మొదట మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బెంగాల్ రాష్ట్రం ఆ తర్వాత మరొక 27 సంవత్సరాల పాటు కమ్యూనిస్టుల కంచు కోట గా ఉంది. కాంగ్రెస్ నుండి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టి తన తన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చింది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ పార్టీని మరింత పటిష్ఠ పరచుకుంది. ఏదైనా తాను అనుకున్నది సాధించేదాకా పట్టువదలని గట్టి మహిళగా పేరు ఉన్న మమతా బెనర్జీ ప్రస్తుతం బిజెపి పార్టీ రాజకీయంగా పేట్రేగిపోవడంతో రాజకీయంగా డిఫెన్స్‌లో పడిపోయింది. నిన్నటి దాకా తన చుట్టూ తిరిగిన వారే, తనకు వెన్నుదన్నుగా ఉన్న వారే పార్టీని విడిపోతుంటే కాపాడుకుందామని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
బెంగాల్ ఘనమైన చరిత్రను ఒకసారి పరిశీలిస్తే చాలా విషయాలు అవగతమవుతాయి. కలకత్తా కేంద్రంగా అలనాటి ఈస్టిండియా కంపెనీ ద్వారానే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చారు. వ్యాపారానికి వచ్చిన వ్యాపారులే ఆ తర్వాత మన దేశానికి పాలకులుగా మారి రెండు వందల సంవత్సరాలు పాలించారు. ఒకనాడు భారతదేశ సాంస్కృతిక, సాహిత్య, ఆర్థిక, రాజకీయ రంగంలో ధ్రువతారగా వెలిగిన బెంగాల్ ఈరోజు దేశ రాజకీయాల్లో కానీ ఆర్థిక సామాజిక రంగాల్లో చాలా వెనకబడిపోయింది. దానికి కమ్యూనిస్టులే కారణమని కాంగ్రెసు, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మూడు దశాబ్దాల పాటు మీరే పాలించారుగా అని కమ్యూనిస్టులు ఒకరినొకరు దెప్పి పొడుచుకున్నారు. ఇక ఈ రెండు పార్టీలను ఎదిరించిన మమతా బెనర్జీ తన ప్రాంతీయ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్‌తో వీరిద్దరిని మట్టికరిపించింది. ఆ తర్వాత కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల నుండి తన పార్టీలోకి ఎంతో మందిని ఆకర్షించింది. ‘తాడిని తన్నే వాడుంటే వాడిని కూడా తలదన్నే వ్యక్తి వస్తారన్నట్లుగా’ మమతా బెనర్జీ రాజకీయాలను తలదన్నే బిజెపి ఇవాళ అటు కమ్యూనిస్టు, కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది.

కలకత్తా నగరం గురించి ఒక నానుడి బహుళ ప్రచారంలో ఉంది ఒక యాభై సంవత్సరాల క్రితం కలకత్తా నగరానికి వెళ్లిన వారు మళ్లీ ఇప్పుడు వెళ్తే అప్పటి పాతకాలం నాటి భవనాలు ఎలాంటి మార్పులేని రోడ్లు కనిపిస్తాయని వారంటారు. ఒక పురాతన నగరాన్ని చూసిన అనుభూతి కలకత్తా నగరాన్ని చూస్తే కలుగుతుంది. దానికి సాక్ష్యంగా ఇటీవలనే కలకత్తా నగరపాలక సంస్థ తమ పౌరులకు ఒక విజ్ఞప్తి చేసింది. అది ఏమిటంటే తమ నగరంలో ఉన్న ఇళ్లకు ఎవరైతే కొత్తగా రంగులు వేసుకుంటారో వారికి ఆ సంవత్సరం పూర్తిగా పన్ను మాఫీ చేస్తాం అని ఆ ప్రకటన సారాంశం. అంటే కలకత్తా నగరంలోని పౌరుల ఆర్థిక స్థితిగతులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఎవరైనా కొత్తవారు వస్తే తమ నగరం అందవిహీనంగా కనబడుతుందని, అందంగా కనపడాలంటే మొత్తం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలంటే తమ సంవత్సర పన్నుల బడ్జెట్ సరిపోదని నగరపాలక సంస్థ ఈ ఉపాయం ఆలోచించింది. ఎవరికి వారు రంగు రంగులు వేసుకుంటే వారికి పన్ను రాయితీ ప్రకటించింది. ఇలాంటి దుస్థితికి బెంగాల్ రాష్ట్ర రాజధాని చేరుకోవడం చూస్తే గతంలోనే కాంగ్రెస్ కమ్యూనిస్టు కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.

అందుకే దేశ రాజకీయాల్లో ఆర్థిక సామాజిక రంగాలలో ఇవాళ బెంగాల్ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. తమ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని కమ్యూనిస్టుల మీద మండిపడిన మమతా బెనర్జీ తన పదేళ్ల పాలన తర్వాత సరిగ్గా అవే ఆరోపణలు బిజెపితో ఎదుర్కొంటోంది. అటు కాంగ్రెస్, ఇటు కమ్యూనిస్టులు చేసిన హింసా రాజకీయాలనే మమతా బెనర్జీ కొనసాగిస్తోందని బిజెపి ఆరోపిస్తోంది. మొత్తం మీద ఈ విషయంలో ఎవరేమీ తక్కువ తినలేదని అందరూ అందరే అని బెంగాల్ ప్రజలు విసుక్కుంటున్నారు. బెంగాలీ బాబులు, బెంగాలీ ప్రజలు అంత త్వరగా మారరని ఒకసారి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన పార్టీ వారికే దశాబ్దాల పాటు ఓటు వేసి వారినే కొనసాగిస్తారని పేరుంది. అలాగే కొత్తను అంత త్వరగా ఆమోదించరని కూడా అంటారు. అందుకే బెంగాల్ రాష్ట్రం అధోగతి పాలు అయిందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఈ స్థితిలో బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనడానికి ఒకటి రెండు సాక్షాలు కనబడుతున్నాయి. మొదటిది 2019 పార్లమెంటు ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లో ఉన్న 42 పార్లమెంటు స్థానాలు 18 స్థానాలు బిజెపి గెలుచుకుంది. దీంతో బిజెపికి ఎక్కడలేని బలం వచ్చింది.

ఆ తర్వాత గత 18 నెలలుగా బిజెపి పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి చొచ్చుకుపోతుంది. కేంద్రంలో అధికారంలో ఉండడం కూడా బిజెపికి కలిసి వచ్చింది. కాంగ్రెసు, కమ్యూనిస్టు, తృణమూల్ కాంగ్రెస్‌లో బలంగా ఉన్న పెద్దపెద్ద అసంతృప్తి నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడంలో బిజెపి నాయకులు సఫలం అవుతున్నారు. ఈ దిశలో ఇప్పటిదాకా ఒకరినొకరు రాజకీయంగా తుదముట్టించిచుకున్న కమ్యూనిస్టు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు పునరాలోచనలోపడ్డాయి. ముఖ్యం గా కాంగ్రెస్, కమ్యూనిస్టు తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు తమ ఉనికికే ప్రమాదం వచ్చే విధంగా బిజెపి రాజకీయాలు నడుపుతుంది. అందుకే బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారా లేక వెనక్కి వెళ్లి పాత పార్టీలకే పట్టం కడతారా అన్నది రేపటి 2021లో జరిగిన ఎన్నికలలో తేలుతోంది.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బెంగాల్ రాష్ట్రంలో మరిన్ని హింసా రాజకీయాలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీనికి అధికారంలో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకరిని ఒకరు ఇలా చంపుకుంటూపోతే మిగిలేది ఎవరు ఉండరు. ఒక ఆదర్శవంతమైన రాజకీయాలకు నెలవుగా ఉన్న రాష్ట్రం ఈ రకంగా హింసా రాజకీయాల రావణకాష్ఠంగా మిగిలిపోవడానికి ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు అన్ని పార్టీల బాధ్యత అని విమర్శకులు అంటున్నారు. ఇప్పటికైనా బెంగాల్ రాష్ట్రంలో నిబద్ధత గల రాజకీయాలు నడపడానికి అవసరమైన కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. ఈ పాత రాజకీయాలకు చరమగీతం పాడితేనే బెంగాల్ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజలు పెనం మీద నుండి పొయ్యిలోకి పడ్డట్టే లెక్క. పొయ్యిలో పడతారా ‘సోయి’లో ఉంటారా బెంగాల్ ప్రజలు రేపటి ఎన్నికల్లో తమ ఓటు ద్వారా నిరూపించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News