Saturday, April 27, 2024

సెబీ ఏం చేస్తోంది? : సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ లో పెట్టుబడి పెట్టినవారు,  అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్  నివేదిక నేపథ్యంలో భారీ నష్టాల్లో కూరుకుపోయారని, మదుపరులను కాపాడవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఈ అంశంపై దేశంలో అమలవుతున్న నియంత్రణ వ్యవస్థల గురించి, తాజా పరిణామాల నేపథ్యంలో చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ ప్రమాణ పత్రాన్ని (అఫిడవిట్‌ను) దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)ను ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని తెలిపింది. న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.

అదానీ గ్రూప్‌పై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ పన్నిన కుట్రపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. అదానీ స్టాక్స్‌ను హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్ చేసిందని, ఫలితంగా పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్పందిస్తూ, హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో మార్కెట్ పతనమవడం వెనుక కారణాలపై నివేదికను సోమవారంనాటికి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెబీని ఆదేశించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు నియంత్రణ నిబంధనావళిని ఏ విధంగా పటిష్టపరచవచ్చునో సలహాలు ఇవ్వాలని కోరింది. కేంద్రం, సెబీలను సంప్రదించి ఈ నివేదికను రూపొందించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. సెక్యూరిటీ మార్కెట్లకు వర్తించే చట్టాలు, నియంత్రణ శాసనాలలో తగిన సవరణలను సిఫారసు చేసేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది.

ఈ సందర్భంగా ధర్మాసనం ఆచితూచి మాట్లాడింది. ‘మేం ఏం చెప్పినా మార్కెట్ సెంటిమెంట్, పెట్టుబడిదారుల ఆత్మవిశ్వాసం ప్రభావితం కావచ్చు’అని పేర్కొంది. పెట్టుబడిదారులను కాపాడటానికి పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని తెలిపింది. మూలధనం ప్రవాహం నిరంతరాయంగా జరుగుతోందని, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారని పేర్కొంది. సెబీని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా నిరోధించడానికి తగిన విధంగా చట్టపరమైన నిబంధనలను సవరించేందుకు సూచనలు చేయడానికి ఓ నిపుణుల కమిటీని నియమించడంపై ఆలోచిద్దామా? అని అడిగింది.

పిటిషనర్లు తమ వాదనలో, హిండెన్‌బర్గ్ నివేదిక వల్ల కేవలం మన దేశంలోని స్టాక్ ఎక్స్ఛేంజ్‌ కుదుపునకు గురికావడం మాత్రమే కాకుండా, మన దేశంలోని వ్యాపారవేత్తలు అమలు చేసే వ్యాపార పద్ధతులు ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయని, ఈ పరిస్థితికి కారణమైన హిండెన్‌బర్గ్‌పై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిటీ చేత న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎటువంటి నియంత్రణలు లేకుండా కార్పొరేట్ సంస్థలకు రుణాలు ఇస్తుండటం వల్ల ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, భారీ కార్పొరేట్ సంస్థలకు రూ.500 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేయడంపై పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News