భోపాల్: నలుగురు ఆడ పిల్లలను కన్నదనే కోపంతో భర్త, అత్తమామలు కోడలను దారుణంగా హత్య చేసిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లా దండోలి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దండోలి గ్రామంలో సావిత్రి భగేల్-రతన్ సింగ్ అనే దంపతులు ఉన్నారు. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మూడు నెలల క్రితం నాలుగో కాన్పులో కూడా ఆడపిల్ల జన్మించడంతో అప్పటి నుంచి ఆమెను అత్తింటి వారు వేధిస్తున్నారు. భర్త రతన్ సింగ్, అతడి తండ్రి కిలోల్డ్ సింగ్, తల్లి బేనూ బాయ్ ఆమెను సూటి పోటి మాటాలతో వేధించేవారు. వాళ్లు వేధింపులు రోజు రోజుకు అధికమయ్యాయి. గురువారం సాయంత్రం సావిత్రి భగేల్ పై రతన్ సింగ్ దాడి చేశాడు. వెంటనే అత్తమామలు ఆమె గొంతు నులిమి చంపేశారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.