పాక్ ప్రధాని ఇమ్రాన్ ‘క్యా’మెంట్
ఇస్లామాబాద్ : ఆడవాళ్లు మరి కురచ బట్టలు వేసుకుని తిరగడం వల్లనే లైంగిక దాడులు జరుగుతున్నాయని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. పాకిస్థాన్లో లైంగిక అత్యాచారాల కేసులు పెరిగిపోతున్న అంశంపై ఆయన హెబిఒ ఇంటర్వూలో స్పందించారు. ఒళ్లు కన్పించే దుస్తులు ధరించి బయటతిరిగితే అది ఖచ్చితంగా మగవారిపై ప్రభావం చూపుతుంది. ఎంతైనా మనిషి రోబో కాదు కదా..ఫీలింగ్స్ అనేవి ఉండనే ఉంటాయని, ఇదో కామన్సెన్స్ అంతే అన్నారు. అత్యాచారాలకు మహిళల వైఖరే కారణమనే ఇమ్రాన్ వ్యాఖ్యలు తిరిగి దుమారం రేపాయి. గత ఏడాది ఇమ్రాన్ జియో న్యూస్కు ఇచ్చిన ఇంటర్వూలో ఇదే విధమైన అభిప్రాయం వెలువరించారు.
అసభ్యతతోనే అత్యాచారాలు జరుగుతాయని, ఇదంతా కూడా పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన వ్యవహారం అని చెప్పడంపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఇప్పుడు కూడా ఇదే విధమైన వ్యాఖ్యలకు ఆయన దిగారు. ఈ సందర్భంగా ఆయన మహిళల బురఖా పరదాల విధానాన్ని పరోక్షంగా సమర్థించారు. సమాజంలో వికృత చేష్టలను నివారించేందుకు కొన్ని కట్టుబాట్లు అవసరం. పరదా విధానం ఇందులోనిదే. ప్రతి ఒక్కరిలో ఆత్మనిగ్రహ శక్తి ఉండకపోవచ్చు , ఇటువంటి వారిలో ఇతరత్రా భావనలు తలెత్తకుండా చేసే ప్రక్రియ అవసరమే. ఈ విషయంలో స్త్రీల కట్టుబాట్లు, వారి వేషధారణ వంటివి కీలకమే అవుతాయన్నారు.