Sunday, May 12, 2024

దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలి

- Advertisement -
- Advertisement -

మహిళలకు అధికంగా రిజర్వేషన్ కల్పించాలి
మహిళా బిల్లు పాస్ చేసి బిజెపి తన చిత్త శుద్ధి నిరూపించుకోవాలి
కాంగ్రెస్ ఎందుకు మహిళా బిల్లుపై ప్రశ్నించదు ?
‘షి ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియా’ పాలిటిక్స్
పుస్తకావిష్కరణలో ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా బిల్లుపై బిజెపి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కవిత సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని కవిత నిలదీశారు. పెంచబోయే పార్లమెంట్ సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సిఎం కెసిఆర్ విధానమని ఆయన స్పష్టం చేశారు. జాతీయ స్థాయి జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్‘ అనే పుస్తకాఆవిష్కరణ సభలో ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని ఇళ్లలో ఏం జరుగుతుందో రాజకీయ పార్టీల్లో కూడా అదే జరుగుతుందన్నారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్న తప్పనిసరి నిబంధన లేనంత వరకు పార్టీల్లో అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు 50 శాతం కాకుండా 33 శాతం రిజర్వేషన్ ఎందుకన్న చర్చ కూడా జరుగుతోందని, ఎక్కడో ఒక చోట అడుగుముందుకు పడాలన్నారు.
మహిళా బిల్లును కేంద్రం ఎందుకు తీసుకురావడం లేదు?
అధిక మెజారిటీ ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే ఒక్క నిమిషం చాలని, కేంద్రం ఆ రకంగా ఆలోచించడం లేదన్నారు. ఐపిసి, సిఆర్‌పిసి, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి మూడు బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ఎందుకు తీసుకురావడం లేదని కవిత ప్రశ్నించారు. పెంచబోయే పార్లమెంట్ సీట్లల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. కార్పొరేట్ రంగంలో మహిళలకు బోర్డు రూముల్లో మహిళల ప్రాతినిధ్యం స్వల్పంగా ఉందని, వివక్ష కొనసాగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రారంభిస్తున్న దాదాపు 80 శాతం స్టార్టప్ సంస్థలకు బ్యాంకుల మద్ధతివ్వడం లేదని, బ్యాంకులు సహకరిస్తున్న వాటికి సంబంధించి కూడా పురుషుల వ్యాపారాలతో పోల్చితే మహిళలు చేస్తున్న వ్యాపారానికి తక్కువ నిధులు ఇస్తున్నాయన్నారు.
ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోంది
ప్రతి సంవత్సరం ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోందని, చదువుకున్న మహిళలకు ఎక్కడికి వెళ్తున్నారని కవిత ప్రశ్నించారు. దేశంలో 29 శాతం మహిళలు మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారని, ఇలా అయితే దేశం వృద్ధి చెందలేదని, సమాజంలో మార్పురావాలని కవిత స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో ఎంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని ఆమె ప్రశ్నించారు. గ్రామాల్లో మహిళా సర్పంచ్‌లు ఇంటింటికి తిరిగి పన్నులు వసూలు చేసున్నారని, పన్నుల రూపంలో పంచాయతీలకు రాబడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారని కవిత ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ కమిటీ పదవుల్లోనూ రిజర్వేషన్ కల్పించిందన్నారు. భారత్‌లో కంపల్సరీ ఓటింగ్ రావాలని కవిత అభిప్రాయపడ్డారు. దీనిపై తీవ్రంగా ఆలోచించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి వ్యవస్థపై అధ్యయనం చేయాలని కవిత సూచించారు. పట్టణాలు, నగరాల్లో చదువుకున్న వారు చాలా మంది ఓటేయడానికి రాకపోవడం బాధాకరమని కవిత తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News