గాంధీనగర్: 70 ఏళ్లుగా అన్న పానీయాలు ముట్టుకోకుండా కేవలం గాలితోనే జీవించిన యోగి ప్రహ్లాద్ జాని మంగళవారం ఉదయం గాంధీనగర్ జిల్లాలో తుది శ్వాస విడిచారు. భక్తుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని రెండు రోజలు పాటు బనస్కాంత జిల్లాలోని ఆయన ఆశ్రమంలో ఉంచనున్నారు. అనంతరం గురువారం నాడు అదే ఆశ్రమంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 90 ఏళ్ల ప్రహ్లాద్ జాని గుజరాత్లోని చరదా గ్రామంలో జన్మించారు.ఈ యోగిని ఆయన భక్తులు ప్రేమగా ‘చునిర్వాలా మాతాజీ’గా పిలుస్తారు. అంబాదేవి భక్తుడైన ఆయన ఎప్పుడూ ఎర్రటి చీరను ధరించడమే కాకుండా స్త్రీలాగా అలంకరించుకునే వారు. అందుకే ఆయనను అలా పిలిచే వారు. గుజరాత్లో ఆయన గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. తిండీ, నీళ్లు లేకుండా 70 ఏళ్ల పాటు జీవించడంతో అనేక మంది శాస్త్రజ్ఞులు ఆయనపై అధయనాలు చేశారు. వారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఉన్నారు.
ఏమీ తినకుండా ఎలా జీవిస్తున్నారో తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు. ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ అసలు కారణం మాత్రం తెలుసుకోలేకపోయారు. 2010లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఆర్డిఓకు చెందిన డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించారు. అందులో భాగంగా యోగిని 15 రోజుల పాటు ఓ గదిలో ఉంచి వీడియో మానిటరింగ్ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఐ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు అసాధారణ రీతిలో ఆకలి, దప్పి తట్టుకునే శక్తి ఉన్నట్లు రుజువైంది. అయితే ధ్యానమే తనను బతికిస్తోందని యోగి గతంలో ఒక సందర్భంలో చెప్పారు. కాగా యోగి ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉండడం గమనార్హం.