Friday, April 26, 2024

కేంద్ర ప్రభుత్వం” కాపీ పేస్ట్ ” ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

Youths from BJP and Congress party who joined TRS party

హైదరాబాద్ : సిద్ధిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల, పట్టణంలోని 37వ వార్డు నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీ లో మంత్రి హరీష్ రావు గారు ఆహ్వానించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్ధిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఇతర నియోజకవర్గాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని , అభివృద్ధితో పాటు సేవలో ఆదర్శంగా నిలిచిందని, ఇది ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు.2001 నుంచి 2014 వరకూ ఉద్యమంలో సిద్ధిపేట ఆదర్శంగా ఉన్నదని నాటి ఉద్యమం.. నేటి అభివృద్ధి అన్నింటి లో ఆదర్శంగా నిలుస్తుమన్నారు. సిద్ధిపేట అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారని ప్రతిపక్షాల తీరుపై మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతున్నది.

రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ప్రధాన మంత్రులు మారినా ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయారని, తాగునీరు ఇవ్వలేకపోయారని కాంగ్రెస్, బీజేపీ లపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మూడున్నరేళ్లలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ తాగునీరు అందించారు. దాన్నే కేంద్ర ప్రభుత్వం “హర్ ఘర్ కో జల్” పేరిట కాపీ కొట్టింది. మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేస్తే.. నాటి కాకతీయుల కాలం నాటి చెరువు లను వారసత్వ సంపదకు పూర్వ వైభవంగా 40వేల చెరువులను బాగుచేకున్నామన్నారు. అదే మిషన్ కాకతీయ తరహాలో “అమృత్ సరోవర్” పేరిట కేంద్రం కాపీ కొట్టిందని చెప్పారు.. మూగజీవాల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 అంబులెన్స్ లు పెట్టి, డయల్ 1962 ఎమర్జెన్సీ తో మూగజీవాల ప్రాణాలు కాపాడుతున్న పశుసంవర్ధక పథకాన్ని కాపీ కొట్టి ఇవాళ కేంద్రం దేశమంతా అమలు పరుస్తున్నది. పెట్టుబడి సాయం కింద రైతుబంధు పేరిట ఎకరాకు రూ.5వేలు ఇస్తే, కేంద్రం పీఏం కిసాన్ యోజన కింద కాపీ కొట్టి అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిపాలన బాగున్నదనే తెలంగాణ పథకాలు కాపీ కొడుతున్నదని కేంద్రంపై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

దొడ్డిదారిన బాయిలకాడ విద్యుత్తు మీటర్లు పెడితే 35 వేల రూపాయల కోట్లు ఇస్తామని, ఉచితాలు బంద్ చేయాలని కేంద్రం మెలిక పెట్టిందని మంత్రి ఫైర్ అయ్యారు. దేశంలో 26 శాతం నిరుద్యోగత ఉన్నదని, బీజేపీ యేటా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పటికే 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు పెట్టిందని, ఎనిమిదేండ్లలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని, పైగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేట్ పరం చేస్తున్నదని మండిపడ్డారు.. ఇది కేంద్రం చేస్తున్న కాపీ పేస్ట్ అని అన్నారు.. మరో వైపు మత విద్వేషాలు రెచ్చ కొడుతున్నారు అందుకే మనం అంత అప్రమత్తంగా ఉండాలి.. ఒక సారి ఆలోచించాలి.. 70 ఏళ్లలో జరగని గ్రామాల అభివృద్ధికి స్వరూపం నేడు పల్లెల్లో అభివృద్ధి పరిడవిల్లుతుంది.. పల్లెల్లో పచ్చధనం వెల్లువిరుస్తుంది.. నాడు సిద్దిపేట కు మహిళ డిగ్రీ కళాశాల కావాలని ఎన్నో ఏళ్ల కల అది ఎమ్మెల్యే ఎన్నికల కు హామీ గా మారింది అలాంటి సిద్దిపేట నేడు విద్యాలయాలకు నిలయంగా మారిందన్నారు.. ఈరోజు చేరుతున్న ప్రతి ఒక్క యువకులు అలోచించి ప్రజల్లో నిజాన్ని తెలియజెప్పాలన్నారు.. జిల్లా బీజేపీ నాయకులు నరేష్ ఆధ్వర్యంలో ,కాంగ్రెస్ నాయకులు చైతు ఆధ్వర్యంలో టి ఆర్ ఎస్ 50 మంది యువకులు పార్టీ లో చేరారు వారికి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు.. పార్టీ లో చేరిన ప్రతి ఒక్కరికి గుర్తిస్తామనిసముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News