సిద్దిపేటలో జలసిరి, కరువు అనే పదానికే స్థానముండదు
కాలంతో పనిలేకుండా రెండు పంటలు పండించుకోవచ్చు
రంగనాయకసాగర్ కింద 1.10లక్షల ఎకరాల సాగు
కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేసిన మంత్రి హరీశ్రావు, ఈత కొట్టి మురిసిపోయిన ఎంపి ప్రభాకర్రెడ్డి, ఎంఎల్ఎ రసమయి
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: దశాబ్దాలుగా రైతన్నలు ఎదురు చూస్తున్న గోదావరి జలాల కలను సిఎం కెసిఆర్ సాకారం చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. శనివారం సిద్దిపేట నియోజక వర్గంలోని చంద్లాపూర్ రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువలకు ఆయన నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 365 రోజులూ గోదావరి జలాలు కాలువల్లో ప్రవహిస్తునే ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఇకనుంచి రైతన్నలు కాలంతో పని లేకుండా కాలువల ద్వారా రెండు పంటలను పండించుకోవచ్చని చెప్పారు. కరువు అనే పదానికి ఈ ప్రాంతంలో స్థానం లేదన్నారు. ఆత్మహత్యలకు పులిస్టాప్ చెప్పడమే కాకుండా రైతులు ఆనందంగా జీవించే రోజులు వచ్చేశాయన్నారు. గోదావరి జలాలతో చెరువులు, కుంటలు, చెక్డ్యాంలను నింపి నిండు కుండల్లా ఉంచుతామని మంత్రి వెల్లడించారు. రంగనాయక సాగర్కు 490 మీటర్ల ఎత్తున్న గోదావరి జలాలు రావడంతో రైతుల ఆనందానికి అవధులు లేవన్నారు.
ఒకప్పుడు ఈ ప్రాంతంలో కాలం అయితేనే రైతుల కడుపు నిండేదని, ఇక నుంచి కాలువల కిందనే పంటలు పండడంతో రైతులకు అధిక ఆదాయం సైతం వస్తుందన్నారు. వర్షకాలంలోపు పిల్ల కాలువల పనులు పూర్తి చేస్తామని, పిల్ల, పంట కాలువల కోసం భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన రైతులను కోరారు. న్నారు. రంగనాయకసాగర్ ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అనంతరం కుడి, ఎడమ కాలువలను మంత్రి పరిశీలించారు. సాయంకాల సంధ్యాహారతిని మంత్రి గోదారమ్మకు సమర్పించారు.
ఇదిలా ఉండగా గోదావరి పరవళ్లు తొక్కుతుండడంతో ఎంఎల్ఎ రసమయి బాలకిషన్, ఎంపి ప్రభాకర్రెడ్డిలు నీళ్లు చల్లుకుంటూ, కాలువలో ఈతకొడుతూ మురిసిపోయారు. మంత్రి హరీశ్రావు వెంట ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంఎల్ఎలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్, టిఎస్ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, కాళేశ్వరం ఎన్సి హరేరాం, నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ,సత్యనారాయణరెడ్డి, కొండం సంపత్ రెడ్డి, శ్రీహరి యాదవ్ , రవి గౌడ్, కనకయ్య, మేర్గు మహేశ్ తదితరులు ఉన్నారు.