న్యూయార్క్ : కరోనా మహమ్మారి మళ్లీ విలయ తాండవం చేస్తోంది. గత 24 గంటల్లో ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో 7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 10 వేల మందికి పైగా మృతి చెందారు. అమెరికాలో అత్యధికంగా 1.43 లక్షల కేసులు, 660 మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్, ఇరాన్లో వైరస్ వ్యాప్తి ఆందోళన కరంగా ఉంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ ఎఫ్డిఎ కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ మార్పిడి చేసుకున్న రోగులకు , బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్ డోసు ఇవ్వాలని సూచించింది.
అమెరికాలో 3 శాతం జనాభా ఈ అదనపు డోసుకు అర్హులని అధికారులు తెలిపారు. సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. బ్రిటన్లో కొత్తగా 33,074 కరోనా కేసులు బయటపడ్డాయి.ప్రస్తుతం బ్రిటన్లో 60 శాతం జనాభా రెండు డోసులు తీసుకోగా, మిగిలిన వారికి వేగంగా టీకాలు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియాలో అధిక జనాభా ఉన్న రాష్ట్రం న్యూసౌత్వేల్స్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఒక్క రోజే 390 మంది వైరస్ బారిన పడ్డారు. సిడ్నీలో జూన్ 26 నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది. ఇరాన్లో ఒక్క రోజే 39 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. 568 మంది మృతి చెందారు.