జిహెచ్ఎంసిలో 214, జిల్లాల్లో 55 కేసులు
టిపిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి, ఇఎన్టి సూపరింటెండెంట్కు వైరస్
జనగామ జిల్లాలో ఓ కంపెనీ యజమాని నుంచి ఏడుగురికి అంటుకున్న కొవిడ్
12 మంది మీడియా ఉద్యోగులకూ తేలిన పాజిటివ్, వైరస్ దాడిలో మరొకరు మృతి
5675కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య
65 శాతం పురుషులకు, 35 శాతం స్త్రీలకు కొవిడ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతుంది. బుధవారం రికార్డు స్థాయిలో ఏకంగా 269 మందికి పాజిటివ్ తేలడం ఆందోళనకరం. ఇప్పటి వరకు ఒక్క రోజుల్లో ఇంత గరిష్ఠంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అదే విధంగా వైరస్ దాడిలో మరోకరు చనిపోయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కానీ వారి పూర్తి వివరాలను అధికారికంగా తెలియపరచలేదు. కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో 214 మంది ఉండగా, జిల్లాల్లో 55 మందికి వైరస్ సోకింది. దీనిలో టిపిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఇఎన్టి సూపరింటెండెంట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే టిపిసిసి నారాయణకు లక్షణాలు లేకపోయిన వైరస్ సోకడం విస్మయానికి గురిచేస్తుంది. శరీరంలో లక్షణాలు లేకపోయినా, కేవలం అనుమానంతోనే టెస్టు చేపించుకోగా పాజిటివ్ కన్ఫామ్ అయిందని ఆయన తెలిపారు. దీంతో వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రైమరీ కాంటాక్ట్లను క్వారంటైన్ చేసి పర్యవేక్షిస్తున్నామని అధికారులు ప్రకటించారు.
అదే విధంగా ఇఎన్టి ఆసుపత్రి సూపరింటెండెంట్కు వైరస్ సోకడంతో ఆ ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో రోగుల నుంచే వైరస్ సోకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో డా శంకర్ ప్రైమరీ కాంటాక్ట్లను, కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు మరో 12 మీడియా ఉద్యోగులకు వైరస్ తేలినట్లు సమాచారం. కానీ అధికారికంగా వాటి వివరాలను తెలుపలేదు. ఇదిలా ఉండగా, జనగామా జిల్లాలో ఓ ఫెర్టిలైజర్ యజమాని నుంచి ఏడుగురు వ్యక్తులకు వైరస్ అంటుకుందని ఆ జిల్లా అధికారులు ప్రకటించారు. దీంతో ఆ కంపెనీలో అందరు భయబ్రాంతులకు గురయ్యారు. అంతేగాక ఫ్రంట్లైన్ వారియర్స్పై వైరస్ పంజా విసురుతుంది.
ఇప్పటి వరకు సుమారు 130 మంది వైద్యులకు పైగా వైరస్ సోకగా దీనిలో ఒక్క నిమ్స్లోనే 66 మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరిలో 26 మంది వైద్యులు, 40 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు పోలీస్ సిబ్బందిలో 155 మందికి పైగా వైరస్ తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5675కి చేరగా, ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి సంఖ్య 3071కి పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2412 ఉండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు 192 మంది చనిపోయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45911 మందికి టెస్టులు చేశామని అధికారులు స్పష్టం చేశారు. ఒక్క మంగళవారం సేకరించిన 1096 శాంపిల్స్లో 269 మందికి పాజిటివ్ రాగా, 827 మందికి నెగటివ్ తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన శాంపిల్స్లో 1959 మందివి ఫెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
హైపర్టెన్షన్, డయాబెటిస్ మిల్లిటస్ మిక్స్డ్తో 71 మంది, నాన్ కో మార్పిడ్తో 35 మంది మరణం…
రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన 192 కరోనా మరణాల్లో వైరస్ సోకకముందు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం వలనే చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో హైపర్ టెన్షన్, డయాబెటిస్ మిల్లిటస్ మిక్స్డ్తో 71 మంది, 35 మంది నాన్ కో మార్పిడ్ కండిషన్తో చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో పాటు 5 మంది క్యాన్సర్, 5 మంది కిడ్ని సమస్యలు, 7 మంది లంగ్ ఇన్ఫెక్షన్లు, 11 మంది డయాబెటిస్ మెల్లిటస్, హార్ట్ సర్జరీ, డయాబెటిక్ మెల్లిటస్ మిక్స్ అయిన 21 మంది, హెచ్ ఐవి, టిబితో ముగ్గురు, 22మంది కేవలం హైపర్టెన్షన్, ఒకరు గ్యాస్ట్రిక్ సమస్యలు, ముగ్గురు హైపోథోరైడిజమ్, మరోకరు హైపర్టెన్షన్, ఒబియాసిటి కలయికతో, ఏడుగురు నరాల సమస్యలు ఉన్న వారు చనిపోయినట్లు తెలిపారు. ఈ సమస్యలు ఉండటం వలనే కరోనాతో మరణించారని అధికారులు పేర్కొన్నారు.
జిహెచ్ఎంసిలో 214, జిల్లాల్లో 55 మందికి కోవిడ్
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నమోదైన కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో 214 మందికి వైరస్ సోకగా, జనగామా జిల్లాలో 5, జయశంకర్ భూపాలపల్లిలో ఒకరు, కరీంనగర్ 8, కొమరంభీం ఆసిఫాబాద్ 1, మెదక్ 3, మేడ్చల్ 2, ములుగు 5, రంగారెడ్డి 13, సంగారెడ్డి 3, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 10 మందికి వైరస్ నిర్ధారణ అయింది.
65 శాతం పురుషులకు, 35 శాతం స్త్రీలకు వైరస్
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 3671 (65శాతం) మంది పురుషులు ఉండగా, 2004(35శాతం) మంది స్త్రీలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది 26 నుంచి 30 వయస్సు మధ్యలో 679 మంది ఉండగా, 91 నుంచి 95 ఏళ్ల మద్యలో అతి తక్కువగా 5 మంది వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు.
వయస్సు వారీగా పాజిటివ్లు…
వయస్సు కేసుల సంఖ్య
0 నుంచి 5 159
6 నుంచి10 125
11 నుంచి15 167
16 నుంచి20 244
21 నుంచి25 559
26నుంచి30 679
31నుంచి35 638
36నుంచి40 614
41నుంచి45 490
46నుంచి50 519
51నుంచి55 458
56నుంచి60 369
61నుంచి65 267
66నుంచి70 191
71నుంచి75 106
76నుంచి80 54
81 నుంచి85 23
86నుంచి90 8
91నుంచి95 5
టిపిసిసి కోశాధికారి
నారాయణరెడ్డికి కరోనా
మన తెలంగాణ/హైదరాబాద్ : టిపిసిసి కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి కరోనా సోకింది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. వివరాల్లోకి వెళితే.. ఒంటి నొప్పులు, రుచి, వాసన కోల్పోవడంతో అనుమానం వచ్చిన నారాయణరెడ్డి నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని నారాయణరెడ్డి వెల్లడించారు. తాను ఎక్కడా ప్రయాణం చేయలేదని, అయినా కరోనా సోకిందన్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి సామాజిక వ్యాప్తి దశకు చేరి ఉండొచ్చన్న అనుమానాన్ని ఆయన వ్యక్తపర్చారు.
269 New Corona Cases Reported in Telangana