ఏడాది పాటు ఘనంగా శతజయంతి ఉత్సవాలు
కెకె ఆధ్వర్వంలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు : సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. పివి పుట్టిన రోజైన ఈ నెల 28 నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దేశ ప్రధానిగా, స్వతంత్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా, సాహితీ వేత్తగా పివి నరసింహారావు బహువిధాలుగా సేవలు అందించారని కెసిఆర్ అన్నారు. అంత గొప్ప వ్యక్తి తెలంగాణవాడు కావడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని సిఎం అన్నారు. ఆయన సేవలను ఘనంగా స్మరించుకోవడానికి శతజయంతి వేడుకలను గొప్పగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పివి మన ఠీవీ అని గొప్పగా చెప్పుకునే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.
కెకె ఆధ్వర్యంలో కమిటి
పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం సీనియర్ పార్లమెంటు సభ్యుడు కె.కేశవరావు ఆధ్వర్యంలో కమిటిని సిఎం నియమించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పివి కుమారుడు పివి ప్రభాకర్ రావు, కుమార్తె వాణీదేవి, కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, కెటి రామారావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
మరో ఆరేడు మందిని కూడా కమిటీలో చేర్చుకోవాలని కేశవరావును సిఎం కెసిఆర్ కోరారు. కేశవరావు గృహంలో నేడు ( గురువారం) మధ్యాహ్నం 2.30 గంటలకు కమిటీ మొదటి సమావేశం జరుగుతుంది. పివితో కలిసి పనిచేసిన వారు, ఆయనతో అనుబంధం కలిగిన వారు, కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులను సంప్రదించి, ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన జరగాలని సిఎం కెసిఆర్ కమిటీని కోరారు.