లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య జిల్లాలో ఆదివారం ఘోరం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భదార్శ ప్రాంతానికి చెందిన 13 మంది మత్య్సకారులు చేపలు వేట కోసం సరయూ నదికి వెళ్తుండగా సోహవాల్ ప్రాంతంలో వీరి వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అయోధ్య జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మత్స్యకారుల వాహనం రాంగ్ రూట్ లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని డిఎస్ పి ఆర్ కె చతుర్వేది తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.