Thursday, May 16, 2024

7 రోజులుగా సొరంగ చీకటిలోనే 40 మంది కూలీలు

- Advertisement -
- Advertisement -

ఉత్తర్‌కాశీ : ఉత్తరాఖండ్ కుప్పకూలిన సిల్‌క్యారా టన్నెల్ వద్ద సహాయక చర్యలు పలు ఆటంకాలతో 24 గంటలుగా నిలిచిపొయ్యాయి. దీనితో సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కూలీల పరిస్థితి మరింత ప్రశ్నార్థకం అయింది. ఇప్పుడు ఇక్కడికి తీసుకువచ్చిన అత్యంత అధునాతన అమెరికా నిర్మిత ఔగెర్ మిషిన్‌లో యాంత్రిక లోపం ఏర్పడటం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఆదివారం నుంచి టన్నెల్‌లో చిక్కుపడి ఉన్న కూలీల సంఖ్య 40 కాదని 41 అని శనివారం అధికారులు నిర్థారించారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన దీపక్ కుమార్ కూడా ఈ టన్నెల్‌లో పనిచేస్తున్నారని నిర్థారణ అయింది. దీనితో ఇప్పుడు లోపల బందీలుగా మారి తిరిగి వెలుగులోకి వస్తామనే ఆశలు కూలీల్లో అడుగంటుతున్నాయి. టన్నెల్ పై భాగం కూలడంతో చిక్కుపడ్డ కూలీలను భద్రంగా వెలికితీసేందుకు జాప్యం లేకుండానే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే శుక్రవారం ఔగెర్ మిషిన్ పనిచేయకుండా పోయింది. దీనితో టన్నెల్‌లోపల పేరుకుని ఉన్న టన్నుల కొద్ది శిథిలాలను తొలిగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

జాతీయ ప్రధాన రహదారుల మౌలిక ఏర్పాట్ల సంస్థ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఛార్‌దామ్ ప్రాజెక్టు చేపట్టింది. ప్రాజెక్టు పనులను నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ (ఎన్‌ఇసి) ద్వారా వాస్తవికంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా టన్నెల్ నిర్మాణం ద్వారా ప్రయాణ దూరం తగ్గించేందుకు వీలేర్పడుతుంది. అంతేకాకుండా ఎటువంటి వాతావరణంలో అయినా యాత్రికులు తమ యాత్రను కొనసాగించేందుకు వీలుంటుంది. టన్నెల్ వద్ద కూలీల వెలికితీత కార్యక్రమాలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని తమ అధికారిక నివాసం నుంచి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యంత అధునాతన యంత్రాలను తెప్పించడం జరిగిందని, వీటిని వినియోగించుకుని ,సాంకేతిక నిపుణులు సహాయక చర్యలను వేగిరపరుస్తారని, కూలీలు భద్రంగా వెలుపలికి వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికీ కూలీలు కూలిన నిర్మాణపనుల సొరంగంలో చిక్కుపడి శనివారం నాటికి ఆరురోజులు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News