అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతి రోజు 2 లక్షల మందికి భోజనం అందిస్తున్నాం
త్వరలో మరో 50 అన్నపూర్ణ కేంద్రాల ఏర్పాటు
మున్సిపల్ అధికారులతో కలిసి టోలిచౌకిలోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించిన సిఎస్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎవరు ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతి రోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ , జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్తో కలిసి టోలిచౌకి లోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి, 9 మున్సిపల్ కార్పొరేషన్లలలో 300 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనాన్ని అందిస్తున్నామన్నారు.
త్వరలోనే మరో 50 కేంద్రాలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం లాక్డౌన్ను దృష్టిలో పెట్టుకుని ఉదయం 10.30 నుండి గంటన్నర పాటు , సాయంత్రం 5 గంటలకు మరోకసారి భోజనాన్ని అందించేలా వేళలు మార్చామని తెలిపారు.. ప్రతి రోజు దాదాపు 2 లక్షల మందికి భోజనం అందించేలా చర్యలు తీసుకున్నామని సోమేష్కుమార్ వెల్లడించారు. అవసరమైతే ఇంకా ఎక్కువ సెంటర్లు పెంచటానికి సిద్దంగా ఉన్నామన్నారు. ప్రతి సర్కిల్ లో ఒక ప్రత్యేక వాహాన్నాన్ని సిద్ధంగా రెడీమేడ్ కుకుడ్ ఫుడ్ను అవసరం ఉన్న చోటకు వెంటనే అందిచేలా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా భోజనం అవసరం ఉంటే జిహెచ్ఎంసి కాల్ సెంటర్ నెం 040. 21111111 కాల్ చేయాలని ఆయన కోరారు. జిహెచ్ఎంసి ఆప్ ద్వారా కూడా ఆహారాన్ని కోరవచ్చు అన్నారు.
అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి భోజనం అందించే విషయమై మున్సిపల్ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ , జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్లతో ప్రతి రోజు సమీక్షిస్తున్నామని సిఎస్ తెలిపారు. భోజనం విషయమై ప్రభుత్వానికి తగు సహకారం అందించాలని అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సిఎస్ కోరారు. ఎక్కడైన సమస్య ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అన్నపూర్ణ క్యాంటిన్ ద్వారా భోజనం అందిస్తున్న తీరు పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.