వలసకూలీల పరిస్థితి దారుణంగా ఉంది
సొంత ఇళ్లకు చేరుకోలేని దీనస్థితిలో ఉన్నారు
కేంద్రంపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ను ప్రకటించే ముందు ప్రధాని మోదీ ఏమాత్రం ఆలోచించలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఎలాంటి ప్రణాళిక లేకుండానే లాక్డౌన్ను ప్రకటించారని ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు. వలస కార్మికుల పరిస్థితి గురించి కేంద్రం పట్టించుకోలేదన్నారు. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. లాక్డౌన్ భయంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల్లో ఎక్కువ మందికి రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేవని, ఇలాంటి వారికి ఆధార్ నంబర్ ఆధారంగా సాయం చేయాలని ఆయన సూచించారు. గోడౌన్లలో నిలువ చేసిన బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కు బయల్దేరిన 12 ఏళ్ల అమ్మాయి 100 కిలోమీటర్లకు పైగా నడిచి తీవ్ర అలసటతో కన్ను మూసిందని ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయని, ప్రజలు సొంత ఇళ్లకు చేరుకోలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం ఆమోదం తెలిపిన రూ. 30 వేల కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపేసి ఆ మొత్తాన్ని కష్టాల్లో ఉన్న ప్రజలకు పంచాలని ఆయన సూచించారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత వలస కార్మికుల పరిస్తితి ఏమిటని ఓవైసీ ప్రశ్నించారు. ఉద్యోగాలను కోల్పోయిన వారిని మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుంటారా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.