మేడ్చల్లో రూ.4.92కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, నాగర్కర్నూలులో 4కిలోల మెఫిడ్రిన్, హైదరాబాద్ కొరియర్ కార్యాలయంలో 3కిలోల డ్రగ్స్ స్వాధీనం
రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో రూ. 6 కోట్ల డ్రగ్స్ పట్టివేత
మేడ్చల్లో 4.92, నాగర్కర్నూల్లో 4 కేజిల మెఫిడ్రెన్ పట్టివేత
హైదరాబాద్ కొరియర్ కార్యాలయంలో 3 కిలోల మాదకద్రవ్యాల సీజ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని మేడ్చల్, కూకట్పల్లి, హైదరాబాద్, నాగర్కర్నూల్ ప్రాంతాలలో శనివారం నాడు ఎన్సిబి, ఎక్సైజ్ అధికారుల దాడుల్లో 8.9 కిలోల మెపిడ్రెన్,3 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో ఎన్సిబి, ఎక్సైజ్ అధికారుల దాడులలో దాదాపు రూ.6 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కొరియర్ కార్యాలయంలో శనివారం నాడు ఎన్సిబి అధికారులు రూ. 3 కోట్ల విలువ చేసే 3 కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఎపిలోని నరసాపురం నుంచి అస్ట్రేలియాకు తరలించే క్రమంలో హైదరాబాద్లో ఓ కొరియర్ కార్యాలయంలో డ్రగ్స్ ఉన్నట్లు ఎన్సిబి జోనల్ డైరెక్టర్ అమిత్ ఘవాటేకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు చేసిన పార్శిల్లో చీరల లోపల భాగంగాలో మాదకద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించిన ఎన్సిబి అధికారులు వెంటనే స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఆస్ట్రేలియాలో ఓ తెలుగు కుటుంబం వివాహ వేడుకలకు భారీగా డ్రగ్స్ తరలిస్తున్నట్లు ఎన్సిబి అధికారుల ప్రాధమిక విచారణలో తేలింది. కొరియర్ కార్యాలయంలోని చీరల పార్శిల్లో ఎవరికీ అనుమానం రాకుండా చీరల ఫాల్స్ను మాదకద్రవ్యాలు నింపి కుట్టేసినట్లు అధికారులు గుర్తించారు. కాగా ఈ డ్రగ్స్ను కొరియర్ చేసిన వ్యక్తి వివరాలను ఎన్సిబి అధికారులు పరిశీలించడంతో చెన్నైకు చెందిన వ్యక్తిగా తేలింది. కొరియర్ కార్యాలయంలో సమర్పించిన వివరాల ఆధారంగా ఎన్సిబి అధికారులు చెన్నె వెళ్లి ఆరా తీయగా కొరియర్ చేసిన వ్యక్తి చిరునామా తప్పుగా ఉన్నట్లు తేలింది. అదేవిధంగా కొరియర్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి కొరియర్ సిబ్బందికి నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు విచారణలో తేలడంతో ఎన్సిబి అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో కొరియర్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తరలింపులో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలపై ఎన్సిబి ఆరా తీస్తోంది. ఇదిలావుండగా బెంగళూర్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్న మరో ముఠాను ఎన్సిబి అధికారులు కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన దేవనహల్లి టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేశారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించిన బెంగళూర్ ఎన్సిబి అధికారులకు లభ్యమైన సమాచారం మేరకు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు బెంగళూర్ నుంచి మాదకద్రవ్యాలు తీసుకెళ్లి హైదరాబాద్లోని పబ్బుల్లో విక్రయిస్తున్నట్లు ఎన్సిబి దర్యాప్తులో తేలింది. ఎన్సిబికి పట్టుబడిన నిందితుల్లో హైదరాబాద్కు చెందిన యువకుడితో పాటు ఎపి, బిహార్కు చెందిన ముగ్గురు వ్యక్తులున్నట్లు సమాచారం.
మేడ్చల్, నాగర్కర్నూల్, కూకట్పల్లి ప్రాంతాలలో శనివారం నాడు ఎక్సైజ్ అధికారుల దాడుల్లో దాదాపు రూ. 3 కోట్ల విలువ చేసే 8.9 కిలోల మెపిడ్రెన్ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మెపిడ్రెన్ను తరలిస్తున్న కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా మరో ఇద్దరు నింధితులు పరారీలో ఉన్నట్లు అధికారులు వివరించారు. నగరంలోని కూకట్పల్లిలోని న్యూ బాలాజీనగర్ ఎస్విసెలక్షన్ అపార్టుమెంట్లో మేడ్చల్ జిల్లా టాస్క్ఫొర్స్ సిఐ సహదేవ్ నేతృత్వంలో దాడులు నిర్వహించగా కరీంనగర్ జిల్లా గన్నేరు వరం మండలంలోని చోక్కారావుపల్లి గ్రామానికి చెందిన పవన్ అలియాస్ చిలుకూరి ప్రశాంత్రెడ్డి వద్ద వద్ద 5 గ్రాముల మెఫెడ్రైన్ పట్టుబడింది. దీంతో పవన్ను పట్టుకుని విచారించగా మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజీపేటకు చెందిన కన్నారెడ్డి అలియాస్ మహేశ్వర్ నుంచి వచ్చిందని తెలపడంతో బొంగూళూరు గేటు వద్ద గల గురుదత్త లాడ్జిలో ఉన్నదనే పక్కా సమాచారంతో అక్కడికి వెళ్ళి పట్టుకున్న పొలీసులతో సుమారు అతని వద్ద నుంచి 921 గ్రాముల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం విచారణలో నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని బవాజీపల్లి గ్రామానికి చెందిన కొండనూరి రామకృష్ణగౌడ్తో ఫోన్ చేయించగా డ్రగ్ కావాలని పిలిపించడంతో నేరుగా తన కారు (టిఎస్ 07 జీఎన్ 8148)లో సుమారు 4 కేజీల డ్రగ్స్తో వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకోవడంతో పాటు కారుతో పాటు డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ దాడుల్లో సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే సుమారు 4 కిలోల 926 గ్రాముల మత్తు పదార్థంతో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి, మేడ్చల్, నాగర్కర్నూల్ ప్రాంతాలలో పట్టుబడిన మెపిడ్రెన్ విద్యార్థులకు సప్లై చేయడానికి తీసుకువచ్చినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు కీలక నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని సైతం అనతికాలంలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. అదేవిధంగా డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నామని, ఈ కేసులో పవన్, మహేశ్ రెడ్డి, రామకృష్ణ గౌడ్ను అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితులు ఎస్.కె.రెడ్డి, హనుమంతరెడ్డి పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.