Saturday, April 27, 2024

బోగస్ సంస్థలకు చెక్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో జిఎస్‌టి ఇంటెలిజెన్స్ స్పెషల్ డ్రైవ్
దేశవ్యాప్తంగా 6,600 బోగస్ సంస్థల గుర్తింపు
2,200 కేసులు నమోదు, 215 అరెస్ట్
రూ.700 కోట్లు రికవరీ చేసిన వైనం
రాష్ట్రంలో వారంలో ఆరుగురికి రిమాండ్

 

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా దాదాపు 6,600 బోగస్ సంస్థలపై 2,200 కేసులను నమోదు చేశామని, ఈక్రమంలో 215 మంది అక్రమార్కులను అరెస్టు చేసి నిందితుల నుంచి రూ.700 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర జిఎస్‌టి అధికారులు మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం వారం రోజుల వ్యవధిలో రాష్ట్రంలో రెండు వందలకుపైగా బోగస్ సంస్థలకు నకిలీ ఇన్‌వాయిస్‌లను ఇచ్చిన ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఈక్రమంలో 200 కంపెనీలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని నిర్ణయించిన సిజిఎస్‌టి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అనుమానం ఉన్న సంస్థలకు చెందిన ఇ వే బిల్లులతో పాటు వాహనాల నంబర్లు, ఆయా సంస్థలు పేర్కొన్న సామగ్రిని పరిశీలించడం ద్వారా బోగస్ సంస్థల అక్రమాలపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిఎస్‌టి అధికారులు స్పష్టం చేశారు.

ఇన్‌ఫుట్ ట్యాక్స్ దుర్వినియోగం…

జిఎస్‌టి విధానంలో జీఎస్టీ కౌన్సిల్ వ్యాపారి రెండోసారి చెల్లించిన పన్నును వ్యాపారికి తిరిగి ఇచ్చే ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం దుర్వినియోగమౌతోందని జిఎస్‌టి అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు కొనుగోలు చేసిన వస్తువుల విలువపై రెండోసారి జిఎస్‌టి చెల్లించిన పక్షంలో ఆయా మొత్తాన్ని సంబంధిత వ్యాపారి, కంపెనీ, వాణిజ్య సంస్థల ఖాతాల్లో నేరుగా జమయ్యే విధానాన్ని కొందరు అక్రమార్కులు వారికి ఆదాయంగా మార్చుకుంటున్నారని అధికారులు వివరిస్తున్నారు. వ్యాపారి ఒక లక్ష రూపాయలకు గాను 18 శాతం జిఎస్‌టి చెల్లించినందున లాభంపై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ రెండోసారి చెల్లించిన మొత్తంలో లాభంపై జిఎస్‌టి మినహాయించుకొని మిగిలిన సొమ్మును ఆ వ్యాపారి ఖాతాకు జమ అయ్యేట్లు జిఎస్‌టి కౌన్సిల్ ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తోందని, ఈ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానమే అక్రమార్కులకు వరంగా మారిందని అధికారులు వివరిస్తున్నారు.

ఛార్టర్డ్ అకౌంట్ల మాయాజాలం…

అనామకుల ఆధార్‌కార్డులు, ఇతర పత్రాలను ఉపయోగిస్తూ చార్టడ్ అకౌంటెంట్‌ల సహాయంతో కొందరు వ్యాపారులు బోగస్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారని, అనుమతులు పొందుతున్నారు. ప్రధానంగా ఇనుము, ఐరెన్ స్క్రాప్, టైల్స్, మార్బుల్స్, గ్రానైట్ లాంటివి క్రయవిక్రయాలు చేసినట్లు లెక్కలు చూపించి ఆ వస్తువులు ఒక దగ్గర నుంచి మరో చోటుకు వెళ్లకుండానే వెళ్లినట్లు ఈ వే బిల్లులు సృష్టిస్తున్నట్లు జిఎస్‌టి ఇంటెలిజెన్స్ బృందాలు గుర్తించాయి. ఈ బిల్లులపై సరకు రవాణా అయినట్లు వాహనాల నంబర్ల స్థానంలో తప్పుడు నంబర్లు వేస్తూ కోట్లాది రూపాయల వ్యాపారం చేసినట్లు టర్నోవర్ చూపిస్తున్నారని జిఎస్‌టి అధికారుల విచారణలో తేలింది.

చేయని వ్యాపారాలకూ బిల్లులు…

వ్యాపారం చేయకుండానే చేసినట్లు చూపి ఆయా నకిలీ బిల్లులను జిఎస్‌టి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తూ తద్వారా వచ్చే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కాజేస్తున్నట్లు వెలుగుచూసిందిన్నారు. బోగస్ సంస్థల పేరిట వ్యాపారం చేసినట్లు చూపిస్తూ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని బురిడీ కొట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులకు చెక్ పెట్టేందుకు దేశవ్యాప్తంగా డేటా అనలిటిక్స్, జిఎస్‌టిఎకో సిస్టమ్, జిఎస్‌టి ఇంటిలిజెన్స్ బృందాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి.

రాష్ట్రంలో వారం రోజుల్లో ఆరుగురి అరెస్ట్…

మేడ్చల్ కమిషన్‌రేట్ పరిధిలో నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి 200 కంపెనీలకు ఇచ్చినట్లు జిఎస్‌టి అధికారుల దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా 11 బోగస్ సంస్థలను జిఎస్‌టి అధికారులు గుర్తించిన అధికారులు రూ.67.76 కోట్లు జిఎస్‌టి రాయితీని పొందినట్లు నిర్ధారించారు. ఈక్రమంలో ఛార్టడ్ చార్టెడ్ అకౌంటెంట్ వికాస్ శరాఫ్ సహా కిరణ్‌చౌదరీ, అర్జున్ చౌదరీలను అరెస్టు చేశారు. కీలకమైన మరో నిందితుడు గోర్డన్ సింగ్ కోసం గాలిస్తున్నారు. ఈ ముగ్గురిని నాంపల్లి ఆర్థిక వ్యవహారాల న్యాయస్థానంలో హాజరుపరచగా ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది.అలాగే రంగారెడ్డి సిజిఎస్‌టి కమిషన్‌రేట్ పరిధిలో బోగస్ సంస్థలకు నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించిన ముగ్గురు అక్రమార్కులను అరెస్టు చేసిన విషయం విదితమే. నిందితులు నకిలీ పత్రాలతో మూడు జిఎస్‌టి రిజిస్ట్రేషన్లు తీసుకొని వ్యాపారం చేయకుండానే రూ.19.1 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నట్లు అధికారులు తేల్చారు. మరో రూ.32.54 కోట్లు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంతో వాటిని గుర్తించిన అధికారులు బిహార్‌కు చెందిన ముఖేష్ కుమార్, సంజయ్ జోషి, రాహుల్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసి ఈనె 21 వరకు రిమాండ్‌కు తరలించారు. ఈక్రమంలో నిందితులను కస్టడికి తీసుకుని మరింత లోతుగా విచారిస్తామని సిజిఎస్‌టి, జిఎస్‌టి అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News