హైదరాబాద్ మినీ ఇండియా
ప్రతి రాష్ట్రం వారూ ఇక్కడున్నారు
నగరాన్ని సొంత ఇల్లులా భావిస్తారు : కైట్, స్వీట్ ఫెస్టివల్లో మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒక మినీ ఇండియా అని ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి చెందిన వారు హైదరాబాద్లో ఉన్నారని పేర్కొన్నారు. నగరంలో గుజరాతి గల్లీ, పంజాబీ బాగ్, సింధి కాలనీ, పార్శీగుట్ట వంటి ప్రాంతాలు చెప్పారు. సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్, స్వీట్ ఫెస్టివల్ను మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్గౌడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, భిన్న సంస్కృతుల సమ్మేళనం ఈ భారతదేశం అని, భిన్నత్వంలో ఏకత్వమనేది భారతదేశం గొప్పతనమని పేర్కొన్నారు. ఎన్నో మతాలకు హైదరాబాద్ నెలవుగా మారిందని అన్నారు. అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చి దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడ్డారని పేర్కొన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రం వాళ్లయినా హైదరాబాద్ను ఇంటిలా భావిస్తారని అన్నారు. నగరంలో కైట్ ఫెస్టివల్ను అహ్మదాబాద్ కంటే ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలోనే కైట్ ఫెస్టివల్కు కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్ను అభివృద్ది చేసుకుందామని చెప్పారు. ఎన్నో దేశాల నుంచి ఔత్సాహికులు ఇక్కడికి రావడం సంతోషకరంగా ఉందని వ్యాఖ్యానించారు. కైట్ ఫెస్టివల్గా ప్రారంభమైన ఇది, స్వీట్ ఫెస్టివల్ వరకు విస్తరించిందని తెలిపారు. రకరకాల కైట్స్ తీసుకుని ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి మనకు పరిచయం చేయడం సంతోషంగా కెటిఆర్ అన్నారు. కుటుంబంతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా ఏర్పాట్లు చేసిన సాంస్కృతిక శాఖకు కెటిఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కెటిఆర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి జరిగిందని ఎన్నో అపోహలు, ప్రచారాలు చేశారని అన్నారు. ఆనాడు సిఎం కెసిఆర్ చెప్పినట్టుగానే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందడంలో మంత్రి కెటిఆర్ పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. మూడు రోజుల పాటు జరుగనున్న కైట్ ఫెస్టివల్కు 25 రాష్ట్రాలు, 20 దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ తరలివచ్చారు. కైట్ ఫెస్టివల్తో పాటు వెయ్యికిపైగా మిఠాయిలు కొలువుదీరాయి. అన్ని రాష్ట్రాల మిఠాయిలు, స్నాక్స్తో స్టాల్స్ ఏర్పాటు చేశారు.