సమయం కోరిన తెలంగాణ అధికారులు
హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ భేటీ మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర జలశక్తి శాఖ ఢిల్లీలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణానది బోర్డు కార్యాలయం అమరావతికి తరలించాలని ఎపి పట్టు పట్టిందని, బోర్డు తరలింపునకు తెలంగాణ అధికారులు సమయం కోరినట్టుగా తెలిసింది. ఇదే విషయమై మరోసారి సమావేశం కావాలని ఎపి, తెలంగాణ అధికారుల నిర్ణయించినట్టుగా సమాచారం.
ఈ భేటీలో ఎపి, తెలంగాణ జలవనరులశాఖ అధికారులు సమావేశం కాగా కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లతో పాటు కేంద్ర జలసంఘం చైర్మన్ హాజరయినట్టుగా తెలిసింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి యూపి సింగ్ అధ్యక్షతన శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాగా ముఖ్యంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిధుల విడుదల, గోదావరి నుంచి కృష్ణాకు మళ్లీంచే నీటిలో తెలంగాణ వాటాపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించినట్టుగా సమాచారం. దీంతోపాటు రెండు బేసిన్ల ప్రాజెక్టుల డిపిఆర్ల సమర్పణ, ప్రాజెక్టుల కింద నీటి వినియోగం, కృష్ణాబోర్డు విజయవాడకు తరలింపు వంటి అంశాలతో పాటు పట్టిసీమ నుంచి ఎపి తరలిస్తున్న నీటిలోంచి తెలంగాణకు 45 టిఎంసిల వాటా కేటాయింపు, తాగునీటికి కేటాయించిన నీటిలో కేవలం 20 శాతం మాత్రమే వినియోగం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టుగా అధికారులు పేర్కొన్నారు.