మన తెలంగాణ/ సిటీ బ్యూరో: నగరంలోని మహీంద్ర హిల్స్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇక్కడి స్థానికులు వీధుల్లోకి రావాలంటేనే జంకుతున్నారు. కరోనా బాధితుడి నివాసం నగరంలోని మహీంద్ర హిల్స్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చైనాలో ఈ వ్యాధి తీవ్రత అందరికీ తెలిసిందే.. దీంతో నగరంలో నమోదైన మొదటి కేసు ఈ ప్రాంత నివాసిదే కావడంతో ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి స్థానికులు ఇళ్ల నుంచి బయటి కూడా రావడమే లేదు. దీంతో అప్రమత్తమైన జిహెచ్ఎంసి మంగళవారం అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలతో వీధిలోని పరిసర ప్రాంతాలనూ పూర్తిగా శుభ్రపర్చడంతో పాటు యాంటీ వైరస్ మందును వీధి మొత్తం పిచికారి చేయించారు.
భయపడాల్సిన పని లేదు: మేయర్
కరోనా వైరస్ పట్ల ఏలాంటి భయాందోళనలు అవసరం లేదని, నివారణకు ప్రభుత్వం పూర్తి చర్యలు చేపట్టిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. వైరస్ ప్రబలకుండా అన్ని ముందు జాగ్రత్తలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత, ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి వ్యాప్తి చేందే అవకాశమే లేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని నగరవాసులకు సూచించారు. కరోనా వైరస్ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాల్లో విస్తరించే అవకాశం తక్కువ అన్నారు. గతంలో మన దేశంలో ప్రబలిన డెంగ్యూ స్వైన్ప్లూ లాంటి అనేక అంటు వ్యాధులను ఎదుర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏలాంటి వ్యాధినైన నివారించేందుకు అధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నగరవాసులు ఎవరూ భయాపడాల్సిన పని లేదని ఆయన సూచించారు.