బెంగళూరు: కరెన్సీతో కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ఆ నోట్లను సబ్బు నీళ్లలో కడిగిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు ప్రాంతంలోని మండ్యలో జరిగింది. మరనచకనహళ్లి గ్రామంలో ఓ రైతుకు పట్టు గూడు అమ్మితే డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులపై కరోనా ఉందనే నమ్మకంతో సబ్బు నీళ్లలో వేసి కడిగి ఆపై ఆరబెట్టాడు. కొందరు నోట్లకు నాలుక తడి పదే పదే అంటిస్తుండడంతో కరోనా సోకుతుందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నోట్లను పట్టుకున్న తరువాత చేతులను శుభ్రంగా కడుగుకోవాలని వైద్యులు సూచించారు. నోట్ల ద్వారా కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలని ఆర్బిఐ ఆదేశించిన విషయం తెలిసిందే. నోట్లను ముట్టుకున్న తరువాత శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. భారత దేశంలో కరోనా రోగులు సంఖ్య 5042కు చేరుకోగా 167 మంది మృతి చెందారు. తెలంగాణలో 404 మందికి కరోనా సోకగా 11 మంది చనిపోయారు. ప్రపంచంలో కరోనా వైరస్ 14,47,513 మందికి సోకగా 83,093 మంది మృత్యువాతపడ్డారు.