ఆ వైరస్ను మనుషులు తయారుచేయలేరు
మా ల్యాబ్ నుంచి వచ్చే అవకాశమే లేదు
స్పష్టం చేసిన వుహాన్ వైరాలజీ ల్యాబ్ చీఫ్
బీజింగ్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వుహాన్లో ఉన్న చైనాలోని మొదటి వైరాలజీ లాబోరేటరీ నుంచి పుట్టిందని విస్తృతంగా ప్రచా రం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో సహా ఎందరో ఆరోపణలు చేస్తున్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో పారదర్శకం గా వ్యవహరించలేదని ప్రపంచవ్యాప్తంగా చైనాపై వత్తిడి పెరుగుతోంది. ఈ కొత్త వైరస్ ప్రపంచంలో వ్యాపించడానికి ముందు వుహాన్ లాబోరేటరీ నుంచి పుట్టిందని వస్తున్న సమాచారంపై తమ పాలనా యంత్రాంగం అధ్యయనం చేస్తోందని ప్రెసిడెంట్ ట్రంప్ శనివారం చెప్పారు.
పెద్ద ఎత్తున రేగిన ఈ దుమారాన్ని చైనాలో వుహాన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ వైరాలజీ (డబ్లూఐవి) ఖండించింది. డబ్లూఐవి, అందులోనూ పి4 లేబొరేటరీ ప్రమాదకరమైన వైరస్లను నియంత్రించే వ్యవస్థ ఉంది. ఈ ప్రచారాన్ని ఫిబ్రవరిలో ఒకసారి ల్యాబ్ ఒక ప్రకటనలో తిరస్కరించింది. అయితే డబ్లూఐవి డైరెక్టర్ యుయాన్ ఝిమింగ్ కోవిడ్ 19 తమ ల్యాబ్ నుంచే వెలువడిందనడాన్ని మొదటిసారి ఇచ్చిన మీడియా ఇంటర్వూలో ఖండించారు. ‘మా ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పరిశోధన జరిగేదీ, వైరస్తో, శాంపిల్స్తో ఎలా వ్యవహరించాలో ఇన్స్టిట్యూట్కు తెలుసు. మాకు కచ్చితమైన నియంత్రణా వ్యవస్థ ఉంది. పరిశోధనల్లో మాకు ప్రవర్త నా నియమావళి ఉంది.
కాబట్టి మా ల్యాబ్ నుంచి వైరస్ బయటికొచ్చే అవకాశమే లేదు. ఈ వైరస్ను మనుషులు సృష్టించలేరు. ఇలాంటిది రూపొందించాలంటే అసాధారణమైన ప్రతిభ ఉండాలి. కోవిడ్ 19 కృత్రిమంగా తయారైందనడానికి ఆధారం కూడా లేదు. ఈ సమయంలో అలాంటి వైరస్ను రూపొందించే సామర్థం మనుషులకు లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్లో వుహాన్లో ఈ వైరస్ బయటపడినప్పటి నుంచీ అక్కడి వైరల్ ల్యాబ్ నుంచి కానీ, సమీపంలో ఉన్న సీ ఫుడ్ మార్కెట్ ద్వారా కానీ వ్యాపించి ఉందని ప్రచారం జరిగింది.