ముంబై: కరోనా వల్ల దేశ వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రముఖ క్రీడాకారులు, సెలెబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వల్ల ఇప్పటికే పలు క్రీడలను నిలిపి వేశారు. టెన్నిస్, బ్యాడ్మింటన్, టిటి, హాకీ, ఫుట్బాల్, క్రికెట్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్ తదితర క్రీడలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. దీంతో క్రీడాకారులందరూ బయటకు వెళ్లలేక ఇళ్లలోనే ఉంటున్నారు. ఇక, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. తన కొడుకు ఇజాన్తో కలిసి సరదగా గడుపుతోంది. మరోవైపు కరోనా వల్ల పనులు లేక ఖాళీగా ఉంటున్న నిరు పేదలకు అన్నదానం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటుంది. ఇక, ఇటీవలే ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలను వెల్లడించింది.
కరోనా వల్ల దేశం మొత్తంలో లాక్డౌన్ తప్పడం లేదని, దీంతో అందరూ ఇంటికే పరిమితం కాక తప్పడం లేదని వాపోయింది. తాను కూడా ఇంటిలోనే ఉండిపోయానని తెలిపింది. ఇక ఇప్పట్లో కరోనా తగ్గు ముఖం పట్టే సూచనలు కనిపించడం లేదని పేర్కొంది. కాగా, ఎప్పుడూ తీరిక లేని షెడ్యూల్తో ఉండే తనలాంటి వారికి ఇంటి వద్దే గడపడం చాలా కష్టంగా మారిందని వివరించింది. ఇంటి వద్దే సుదీర్ఘ కాలం ఉండి పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలిపింది. అయితే కరోనా తీవ్ర రూపం దాల్చిన ప్రస్తుత స్థితిలో ఇంటి వద్ద ఉండడం తప్పించి మరో మార్గం లేదని స్పష్టం చేసింది. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్నా దాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాల్సిందేని సానియా పేర్కొంది.