పొట్టకూటికోసం విదేశాలకు వలసవెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు. ఆ వ్యక్తి మృతదేహాన్ని బహ్రెయిన్లోని టిఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో స్వగ్రామానికి చేర్చారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేళ్ల క్రితం బ్రతుకు దెరువు కోసం బహ్రెయిన్ దేశంలోని ఓ ప్రైవేటు కంపెనీలో చేరాడు. దురదృష్టవశాత్తు 14 ఏప్రిల్ 2020 తేదీన ఆయన గుండెపోటుతో మృతి చెందాడు. గంగారాజాంకు భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.అయితే ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తుండటంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఇబ్బందిగా మారింది.
దీంతో బహ్రెయిన్లోని టిఆర్ఎస్ ఎన్నారై సెల్ నాయకులతో పాటు, తోటి స్నేహితులు గంగరాజం పనిచేస్తున్న కంపెనీతో మాట్లాడారు. కంపెనీ సహకారంతో మృత దేహాన్ని ఎమిరేట్స్ కార్గో ప్లైయిట్ లో బహ్రెయిన్ నుంచి హైదరాబాద్కు సోమవారం రాత్రి తరలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారి స్వగ్రామం రాఘవపేట్ వరకు టిఅర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్సు సౌకర్యాన్ని కల్పించారు. ఎమిరేట్స్ కార్గో ప్లైయిట్ ద్వారా బహేరెన్ నుంచి గంగరాజం మృతదేహాన్ని పంపించామని సతీష్కుమార్ రాధారావు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్ బొలిశెట్టి తదితరులు పేర్కొన్నారు. మృతదేహాన్ని బహ్రెయిన్ నుంచి తీసుకురావడానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబులు కృషి చేశారని సతీష్కుమార్ తెలిపారు.
Jagtial Man dies with Heart Attack in Bahrain