హైదరాబాద్ : భాగ్యనగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలుచోట్ల వాహనాల రాకపోకలుఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎల్బీనగర్, పనామా, సుష్మా వద్ద వాహనాలు కదలలేని పరిస్థితి ఉంది. ఆటోనగర్, హయత్నగర్, పెద్ద అంబర్పేటలోనూ వర్షపు నీరు రహదారిపైకి చేరడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు. రెండు గంటలుగా వాహనాల్లో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. హబీబ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ వద్ద ఓ పురాతన భవనం పెచ్చులూడి పడి ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. భవనంలో 13 కుటుంబాలు అద్దెకు ఉంటున్నారన్న సమాచారాన్ని అందుకున్న అధికారులు హుటాహుటిన వారిని ఖాళీ చేయించారు. భారీ వర్షాల ప్రభావం మెట్రో సేవలపై కూడా పడింది. మంగళవారం ఉదయం నుంచి భాగ్యనగరంలో కుండపోతగా వర్షం కురి యడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో, పలువురు నగర వాసులు మెట్రోను ఆశ్రయించారు. అయితే భారీ వర్షాలు, దీనికి తోడు ఈదురుగాలులతో మెట్రో సేవలు నెమ్మదించాయి.
అమీర్పేట-ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లు నెమ్మదిగా నడవగా.. భారీ వర్షాలు, గాలి కారణంగా అక్కడక్కడ కొద్దిసేపు మెట్రో సేవలు నిలిపివేశారు. భారీ వర్షంతో మూసారాంబాగ్ స్టేషన్లో కాసేపు మెట్రో రైలు నిలిచిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో హిమాయత్సాగర్ నిండకుండను తలపిస్తోంది. ప్రాజెకుట పూర్తిస్థాయి నీటిమట్ట 1763 అడుగులు ఉండగా.. ప్రస్తుతం అత్యధిక స్థాయిలో 1762.176 అడుగులకు నీరు చేరినట్లు అధికారులు స్పష్టం చేశారు. వర్షాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకు 833 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. మంగళవారం అర్థరాత్రి సాగర్ గేట్లు ఎత్తనున్నారు. పాతబస్తీలో రెండు ఇళ్లు కూలి ఎనిమిది మంది దుర్మరణం చెందారు.