యోగి ఆదిత్యనాథ్ విరాళం రూ. 11 లక్షలు
వెల్లడించిన రామజన్మభూమి ట్రస్టు
లక్నో: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం శివసేన ఒక కోటి రూపాయలు, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 11 లక్షలు విరాళంగా అందచేశారని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా జరగనున్న శ్రీరామ మందిర నిధి సమర్పణ కార్యక్రమం గురించి వివరించారు. యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తన వ్యక్తిగత హోదాలో ఈ విరాళం అందచేశారని ఆయన చెప్పారు. అయోధ్యలోని శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించే బ్రహ్మాండమైన ఆలయానికి దేశంలోని ప్రతి రామ భక్తుడి సహాయ సహకారాలు స్వీకరిస్తామని ఆయన చెప్పారు. సాధువులు, స్వామీజీలను వెంటపెట్టుకుని విశ్వ హిందూ పరిషద్ కార్యకర్తలు ఇల్లిల్లూ సందర్శిస్తారని ఆయన తెలిపారు.
విదేశాల నుంచి విరాళాలు స్వీకరించేందుకు తమకు అనుమతి లేనందున దేశంలో ప్రజలను కలుసుకోవడం ద్వారా రామాలయ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తామని గతంలో రాయ్ తెలిపారు. ఈ ప్రచారం ద్వారా ప్రతిపాదిత అయోధ్య రామాలయ నమూనాకు చెందిన ఫోటోలు ఇంటింటికీ చేరతాయని ఆయన పునరుద్ఘాటించారు. స్వచ్ఛందంగా విరాళాలు అందచేసే భక్తుల కోసం రూ. 10, రూ. 100, రూ. 1000 కూపన్లను అందుబాటులో ఉంచుతామని ఆయన వివరించారు. విరాళాల సేకరణ, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత కోసం రూ. 10 కూపన్లు నాలుగు కోట్లు, రూ. 100 కూపన్లు ఎనిమితి కోట్లు, రూ. 1000 కూపన్లు 12 లక్షలు ముద్రించినట్లు రాయ్ చెప్పారు. విరాళాల సేకరణకు నిర్దిష్ట గడువు ఏదీ ఖరారు చేయలేదని, అలాగే ఆలయ నిర్మాణ వ్యయానికి సంబంధించి అంచనాలు కూడా ఏవీ వేయలేదని ఆయన తెలిపారు. తాము చేపట్టనున్న ప్రచారం ద్వారా రామ జన్మభూమి ఉద్యమ చారిత్రక ప్రాముఖ్యతను ప్రజలకు చాటుతామని ఆయన వివరించారు.
Shiv Sena contributed Rs1cr for Ayodhya Ram temple