శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని సాంబా ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్తో ఆయుధాలు, పేలుడు పదార్థాలు జారవిడిచిన ఘటన జరిగింది. ఆర్మీ బలగాలు, స్థానిక పోలీసుల సహకారంతో శుక్రవారం ఉదయం కలిసిసాగించిన గస్తీ సోదాల క్రమంలో రాజ్పురా ప్రాంతంలోని బాబ్బర్ నల్లా వద్ద వీటిని కనుగొన్నారని సాంబా జిల్లా పోలీసు అధికారి ఎస్ఎస్పి రాజేశ్ శర్మ తెలిపారు . రెండు పిస్టల్స్, బుల్లెట్ల తూటాల మ్యాగజైన్స్, 122 రౌండ్ల మందుగుండు సామాగ్రి, ఓ సైలెన్సర్ ఈ ప్రాంతంలో స్వాధీనపర్చుకున్నారు. వీటిని సరిహద్దుల ఆవలి నుంచి వచ్చిన డ్రోనుల ద్వారా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న జీరో లైన్కు రెండు కిలోమీర్ల దూరంలో చేరేలా చేశారని నిర్థారణ అయింది. పకడ్బందీగా పాలిథిన్ బ్యాగులలో ఈ పేలుడు సరుకులను చుట్టి ఉంచారు. పాకిస్థాన్ డ్రోన్ ద్వారానే వీటి రవాణా జరిగి ఉంటుందని, స్థానికంగా ఉండే తమ సానుకూల శక్తులకు అందేందుకు వీటిని లష్కరే తోయిబా లేదా ఇతర ఉగ్రవాద సంస్థలు వదిలిపెట్టి ఉంటాయి. లేదా ఇక్కడి భారతీయ సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుని గురితప్పిన దశలో ఇవి ఇక్కడ పడి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. వీటి గురించి, డ్రోన్ కదలికల గురించి ఆరాతీస్తున్నారు.