రోమ్ : ఒకవైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నప్పటికీ ఇటలీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను ప్రజలు జరుపుకున్నారు. సెయింట్ పీటర్స్ బాసిలికాలో దాదాపు 1500 మంది సమక్షంలో పోప్ ఫ్రాన్సిస్ శుక్రవారం క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. సిస్టైన్ చాపెల్ గాయక బృందం నొయిల్ అనే గీతం ఆలపిస్తుండగా బాసిలికా కేంద్ర నడవాలో పోస్ వేడుకలను శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రాత్రి 7.30 నుంచే జనసమూహం వెల్లువలా రావడం ప్రారంభమైంది. గత ఏడాది కరోనా కారణంగా ఇటలీ దేశం మొత్తం మీద కర్ఫూ విధించడంతో 85 ఏళ్ల వృద్ధులను ఆనాడు క్రిస్మస్ వేడుకలకు అనుమతించలేదు.
కానీ ఈ ఏడాది కర్ఫూ లేదు. అయితే ఈ వారం కరోనా కేసులు మాత్రం 2020 నాటి స్థాయి కన్నా ఎక్కువగానే వ్యాపించాయి. శుక్రవారం ఇటలీలో రోజువారీ కేసుల రికార్డు 50,599 ని అధిగమించింది. మరో 141 మంది తాజాగా మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,36,386కు పెరిగింది. వాటికన్ సెక్రటరీ గురువారం వాటికన్ సిబ్బందికి కొత్తగా వ్యాక్సిన్ నిబంధనలను విధించారు. కరోనా నుంచి కోలుకున్నవారు తప్ప మిగతా వారందరికీ వ్యాక్సిన్ తప్పనిసరి చేశారు. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ధనిక దేశాలు వర్ధమాన దేశాలకు టీకాలు అందించాలని, వాక్సినేషన్ను ఒక ప్రేమపూరిత చర్యగా ఆయన పిలుపునిచ్చారు