హైదరాబాద్: పలు ఆరోపణలతో సస్పెండైన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ మాజీ ఇన్స్స్పెక్టర్ మురళీకృష్ణపై ఎసిబి అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. తాను పెట్టిన కేసు దర్యాప్తు కోసం ఎస్ఆర్ నగర్ ఇన్స్స్పెక్టర్ మురళీకృష్ణ డబ్బులు తీసుకున్నాడని సినీనటి శ్రీసుధ ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించిన సాక్షాలను కూడా ఎసిబి అధికారులకు అందజేసింది. సినీఫొటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు తనను వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేశారు.
ఈ కేసులో పోలీసులు శ్యామ్ కె. నాయుడును అరెస్టు చేయకపోవడమే కాకుండా ఏకంగా తాను నిందితుడితో రాజీకుదుర్చుకున్నట్లు నకిలీ పత్రం సృష్టించి కోర్టులో సమర్పించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు ఎసిబి అధికారులను ఆశ్రయించింది. తాను ఎలాంటి రాజీకుదర్చుకోలేదని, తన సంతకం ఫోర్జరీచేసి కోర్టులో పత్రం సమర్పించారని ఆరోపించింది. ఈ విషయం ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన ఎసిబి అధికారులు ఇన్స్స్పెక్టర్ మురళీకృష్ణపై కేసు నమోదు చేశారు. కాగా ఆత్మహత్య చేసుకున్న శ్రావణి తల్లిదండ్రులు అప్పటి ఎస్ఆర్ నగర్ ఇన్స్స్పెక్టర్ మురళీకృష్ణకు దేవరాజు రెడ్డిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
ACB case against former SR Nagar inspector