Friday, May 3, 2024

చెంచు పెంటల్లో మౌళిక వసతుల కల్పనకు చర్యలు

- Advertisement -
- Advertisement -

లింగాల : చెంచుపెంటల్లో మౌళిక సదుపాయాలను కల్పించడంతో పాటు చెంచుల జీవనోపాధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నాగర్‌కర్నూల్ కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. శనివారం ఆర్డిటి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని లింగాలలో కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, లింగాల, బల్మూర్ మండలాలకు చెదిన చెంచు గిరిజనులకు ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రాబిక్వేటెడ్ విధానంలో గృహ నిర్మాణాలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెంచుల సొంతింటి కల నెరవేర్చడానికి గాను ప్రభుత్వం లింగాల, బల్మూర్, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ మండలాల పరిధిని చెంచు గిరిజనుల కోసం 664 ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని, ఒక్కొక్క ఇంటికి రెండున్నర లక్షల చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. ఇట్టి గృహ నిర్మాణ పనులకు ఆర్‌డిటి స్వచ్ఛంద సంస్థకు అప్పగించడం జరిగిందని వెల్లడించారు.

ప్రాబిక్వేటెడ్ విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. చెంచులు ఎవరైనా ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బులకు అదనంగా మరికొంత డబ్బులు వెచ్చించి తాము అనుకున్న రీతిలో నిర్మించుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. తొందర్లోనే ఇళ్ల నిర్మాణాలను చేపట్టి చెంచులకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.

నాగరిక జీవనానికి దూరంగా అటవిలో నివసించే ఆదివాసి చెంచు గిరిజనులు స్వయం సమృద్ధితో ఆర్థిక పరిపుష్టి సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐటిడిఏ ద్వారా చెంచులకు సంక్షేమ పథకాలను అందించే జీవన నైపుణ్యాలను పెంపొందించుతామని, జీవనోపాధి కల్పనకు కృషి చేస్తామని అన్నారు. ఐటిడిఏ, ఆర్డిటి వంటి సంస్థల ద్వారా చెంచుల జీవన నైపుణ్యాలను పెంచి వారి కుటుంబాలకు ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తానని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఐటిడిఏ నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. తాగుడుకు బానిసలుగా మారి కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టకూడదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, తహసిల్దార్ జమీల్, ఆర్డిటి టీం లీడర్ రాధా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News