Saturday, April 27, 2024

అందాల అజంతా గుహలు

- Advertisement -
- Advertisement -

Ajantha guhalu

మన దేశంలో ఉన్న అతి ప్రాచీన గుహాలయాలుగా అజంతా గుహాలయాలు పేర్గాంచాయి. అందువల్ల అక్కడకు వెళ్లడానికి నేనూ, మా మిత్ర బృందం బయలుదేరాం.  అడుగడుగూ ఆధ్మాత్మికానురక్తితో పాటు మానసిక ఆనందాన్ని పెంచే ఈ గుహాలయాలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా అజంతా గ్రామానికి సమీపంలో ఉన్నాయి. హైద్రాబాద్ నుంచి ఔరంగాబాద్ 560 కిలోమీటర్లు దూరం. అక్కడ నుంచి అజంతాగుహలకు 100కిలోమీటర్లు దూరం. అజంతాగుహలకు వెళ్ళే మార్గం మధ్యలో కొంత దూరం నుంచే అద్భుతమైన కొండలు, గుట్టలు మాకు దర్శనమిచ్చాయి. వంపులు తిరిగే ఘాట్ రోడ్డు మార్గం మమ్మల్నెంతో ఆహ్లాదానికి గురి చేసింది.

అజంతా గుహలు దట్టమైన అడవుల మధ్య గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండపై నెలకొని ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాల మీద ఇవి పడమర నుండి తూర్పునకు వ్యాపించి ఉన్నాయి. అపురూప అందాలకు, అబ్బుర పరిచే దృశ్యాలకు నెలవుగా నిలిచిన ఈ గుహలు ప్రపంచ వారసత్వసంపదగా రికార్డులకెక్కాయి. గుహల ప్రాంతానికి వెళ్లగానే అక్కడ గుహల ప్రవేశానికి రుసుం చెల్లించి గుహల ప్రాంగణంలోకి వెళ్లాం.. ఆ ప్రాంతమంతా దేశ, విదేశీ భక్తులతో సందడిగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన గుహాలయాలుగా ఖ్యాతికెక్కిన ఈ గుహాలయాలన్నీ బుద్ధుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాయి. దీంతోపాటు మూడు మతాలకు చెందిన వర్ణమయ చిత్రాలు, శిల్పాలు, చెక్కడాలు ఈ గుహలలో దర్శించుకునే భాగ్యం మాకు కల్గింది. శ్రీలంక దేశంలో కనుగొన్న సిగిరియ గుహలకు ఈ గుహలు అత్యధిక సామీప్యతను కలిగి ఉన్నాయి. ఈ గుహలను తయారు చేయటానికిగాను సుమారుగా 800 సంవత్సరాలు పట్టిందని అక్కడి గైడ్లు చెప్పగా విన్నాను.

అపురూపమైన అనుభూతులను సొంతం చేసే ఈ గుహాలయాలు మొత్తం 29. ఇవన్నీ బుద్ధుని జీవిత విశేషాలను తేటతెల్లం చేశాయి.  బౌద్ధమతానికి సంబంధించిన శిల్పకళను దాచుకున్న కళా నిలయాలుగా వీటిని అభివర్ణించవచ్చు. కొన్ని శిల్పాలు తెరవాడ సంప్రదాయంలో కిరీటం, పాదముద్రలు మాత్రమే కలిగి ఉండగా, మరికొన్ని మహాయాన సంప్రదాయంలో శిల్పాలుగా గోడల్లో తీర్చిదిద్దిన మురల్స్ రూపంలో దర్శనమిచ్చాయి. ఆయా చిత్రాల్లో బుద్ధుడు, ఇతర బోధిసత్వుల జీవితాలు, జాతక కథలు అపురూపంగా చిత్రించారు.

అజంతా గుహలలో అత్యంత ప్రాచుర్యం పొందిన గుహ మొదటి గుహ. మొదటి గుహ అంటే ఇది మొదటగా గుర్తించబడిన గుహ అని అక్కడి వారు చెప్పారు. గుర్రపు నాడా ఆకారంలో ఉన్న పర్వత శిఖరంపై ఇది నెలకొని ఉంది. ఈ గుహలోని ప్రతి అంగుళానికి రంగులు వేసి ఉంది. కాలగతిలో ఈ రంగులు కాస్త చెదిరినట్టుగా తెలుస్తుంది. ప్రధాన ద్వారానికి రెండువైపులా గోడకు చెక్కిన వజ్రపాణి, పద్మపాణిల చిత్రాలున్నాయి.  మొదటి గుహలో ఆరు, ఏడు శతాబ్దాల నాటి వివరాలను దర్శించుకున్నాం. ఈ గుహలో రకరకాల గుర్తులు, చిత్రాలు ఉన్నాయి.

ప్రవేశ మార్గంలో వివిధ భంగిమలలో ఉన్న బుద్ధుని మూర్తులు అందంగా ఉన్నాయి. ఆ బుద్ధునిమూర్తిని నాగులు సంరక్షిస్తున్నట్టుగా ఉన్నాయి. పైభాగంలో ఎడమవైపు మూలమీద ఓ దేవతా విగ్రహం ఉంది. ఆ మూర్తిని భూదేవి అని, ప్రాణాధార నీటికి ప్రతిరూపమని అక్కడి వారు చెప్పారు. ఇక్కడే మరుగుజ్జు దేవదూతలు బుద్ధుడికి పూలమాలలు వేస్తున్న శిల్పాలు కనిపిస్తాయి. మరోవైపు పద్మపాణి అవకితేశ్వర ఒక పద్మాన్ని పట్టుకుని కనిపిస్తాడు. మరోవైపు పిడుగును పట్టిన వజ్రపాణి రూపం దర్శనమిచ్చింది. వీరిద్దరూ కూడా బోధిసత్వలో ఒక భాగంగా ఉంటారు. ఒకే తల కల నాలుగు జింకలు కూడా ఇక్కడ కానవస్తాయి.. కామవాంఛలు తప్పు కాదని చూపే ప్రేమికులు, స్తంభానికి ఆనుకుని నిలుచున్న రాజకుమార్తె, నాట్యకారిణి, బంగారు బాతులు, లేత ఎరుపు రంగు ఏనుగు, ఎద్దుల పోరాట ప్రదర్శన వంటి బొమ్మలు ఈ గుహలో దర్శించుకున్నాం.

రెండో గుహ మొదటి గుహను ఆనుకునే ఉంది. ఈ గుహలో బుద్ధుని పుట్టుకకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. దీని పైకప్పుపై ఉన్న హంసలు బారులు తీరిన చిత్రం ఎంతో హృద్యంగా ఉంది. ఆనాటి ప్రజలు వాడిన పర్సులు, మఫ్లర్లు, చెప్పులను సైతం చిత్రాల్లో చూడవచ్చు. క్రీ.పూ. 2-7 శతాబ్దాల మధ్యకాలంలో వీటిని చిత్రించారట. ఆనాడు వేసిన రంగులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం మమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. 4వ గుహ కూడా 17వ గుహ మాదిరిగా ఉంది. అయితే దీనిని పూర్తి చేయలేదు. ఇక్కడ బుద్ధుడి జీవితానికి సంబంధించిన అనేక అసంపూర్తి చిత్రాలు కనిపించాయి. వంగి కూర్చుని వున్న జింక, మరుగుజ్జు సంగీతకారుడు, పూలగుత్తులు వంటివి ఈ గుహలో దర్శించుకున్నాం.

6వ గుహ మహాయాన బౌద్ధమత కాలాన్ని తెలియజేస్తుంది. దీనిలో కూర్చుని వున్న బుద్ధుడు ఆయన చుట్టూ ఎగురుతున్న జంటలున్నాయి. ఈ గుహలోని స్తంభాలు ముందు గుహలకంటే కూడా నాణ్యత కలిగి అష్ట భుజాలు కలిగి ఉన్నాయి. దీనిలో పద్మంతో కూడిన బిక్షువు చిత్రం ఉంది.  9వ గుహలో చైత్య హాలు సమావేశం కానవచ్చింది. ఇది కూడా తొలి ప్రార్థనా స్థలాల్లో ఒకటి. దీని కిటికీలు ఆర్చీలుగా అందంగా ఉన్నాయి. వీటి నుంచి సూర్యుని వెలుతురు లోపల పడుతుంటుంది. ఇందులో అతి పెద్ద బౌద్ధ స్తూపం ఉంది. నాగులను పూజించేవారు, పశువుల కాపరుల చిత్రాలు నేటికీ ఇక్కడ దర్శించుకోవచ్చు.

10వ గుహలో తెరవాడ ప్రార్థనా హాలుంది. అజంతాలోని అతి పురాతన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటిది. 10వ గుహ శైలిలోను నిర్మాణంలోను 9వ గుహనే పోలి ఉంది.  11వ గుహ ప్రధానంగా హీనయాన కాలం నుంచి మహాయాన కాలం వరకు వచ్చే మార్పులు చూపుతుంది. దీనిలో బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. అందమైన వాకిటి తలుపులు, ద్వార బంధాలు ఉన్నాయి. ఈ గుహ అచ్చెరువొందే నదీ దృశ్యాన్ని కూడా కింద చూపుతుంది. ఈ గుహలో పెద్ద బుద్ధుడి విగ్రహం, బుద్ధుడు ఒక బిక్ష పాత్రను పట్టుకుని వుండటం, బుద్ధుడు రాజకుమారుడుగా, బుద్ధుడు విల్లు ఎక్కు పెట్టటం వంటి శిల్పాలు కనిపిస్తాయి.

తన భర్త సన్యాసి అయిపోతున్నాడని తెలుసుకుని మరణానికి సిద్ధపడే రాజకుమారి శిల్పంగా ఇక్కడ దర్శనమిస్తుంది.
15, 13, 12, 8 గుహలు తెరవాడ సంప్రదాయ మఠాలు. 16వ గుహ ఒక బౌద్ధ మఠం. దీనిలో స్పృహ కోల్పోయిన రాకుమారి సుందరి చిత్రాలున్నాయి. బుద్ధుని సోదరుడు నందుడు సన్యాసిగా మారినట్టు తెలుసుకుని ఆయన భార్య స్పృహ కోల్పోయిన దృశ్యాలు ఉన్నాయి.  17వ గుహలోని చిత్రాలు ప్రేమను చూపుతాయి. అప్సరసలు, విహరిస్తున్న ఆత్మలు, ఇంద్రుడు దేవదూతలు ఉన్నాయి. రాజకుమారుడైన సిద్ధార్ధుడు బౌద్ధ సన్యాసి అయి మరోమారు తన భార్యను, పిల్లలను కలుసుకొని వారిని రాజీ చేస్తున్న సంఘటనలు కూడా చిత్రాలుగా దర్శనమిచ్చాయి.

21వ గుహ ఇతర గుహలకంటే కూడా మరింత ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడ చక్కగా మలిచిన స్తంభాలున్నాయి. ఈ గుహలో చైత్య హాల్ అనబడే పురజనుల బహిరంగ సభ వరండా ఉంది. ఈ నిర్మాణంలో అనేక తోరణాల ఆర్చీలు ఉన్నాయి. ఇవి 26 స్తంభాలపై నిలపెట్టబడి ఉంటాయి. గోడకు కొన్ని శిల్పాలు ఉంటాయి. వరండాకుగల గోడపై బుద్ధుడి విగ్రహం ఉంది. అది ఇపుడు శిథిలావస్థలో ఉంది. దానిని నిద్రిస్తున్న బుద్ధుడిగా భావిస్తారు. అయితే బౌద్ధ సన్యాసులు దానిని బుద్ధుడి నిర్వాణ దశగా భావిస్తారు. ఇక్కడే కోర్కె కల బుద్ధుడి శిల్పం కూడా ఒకటి కనిపించింది. 24వ గుహలో స్తంభాలు, గోడలు, వాకిలి ద్వారబంధాలు ఉన్నాయి. స్తంభాల శైలి అసంపూర్తిగా ఉంది. 24వ గుహ అసంపూర్తిగానే ఉండిపోయింది. 26వ గుహలో మహాయాన ప్రార్థనా మందిరం ఉంది. బుద్ధుని నిర్మాణాన్ని తెలిపే బౌద్ధ విగ్రహం విశ్రాంతిగా పడుకుని ఉన్నట్టుగా దర్శనమిస్తుంది. ఆయన అనుచరులు దుఃఖించడం, పైన దేవతలు ఆనందంగా స్వాగతాలు పలకటం కూడా చిత్రించి ఉంది. 27వ గుహ రెండు భాగాలుగా ఉంది. అవి నాగ ద్వార పాల, వాకిలి ద్వార బంధాలుగా చెబుతారు.

ఎలా చేరుకోవాలి?

అజంతా గుహలను చేరుకోవడానికి
ఔరంగాబాద్ వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఔరంగాబాద్‌కు రైలు సదుపాయం ఉంది. అక్కడ నుంచి అజంతా గుహలకు సులువుగా చేరుకోవచ్చు. ఔరంగాబాద్ లో విమానాశ్రయం కూడా ఉంది.

దాసరి దుర్గాప్రసాద్, 77940 96169

Ajanta caves in telugu matter
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News