చెన్నై: ప్రముఖ నటి అమలాపాల్, తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ మధ్య కాపురం కొద్ది కాలమే నడిచింది. వారిద్దరూ దైవ తిరుమగళ్ అనే చిత్రం సెట్స్లో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఎంతో వైభవంగా పెద్దల సమక్షంలో 2014 జూన్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి క్రైస్తవ, హిందూ సాంప్రదాయాలలో జరిగింది. అయితే తమ వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నట్లు వారిద్దరూ హఠాత్తుగా పేల్చిన బాంబు వారి అభిమానులను షాక్కు గురిచేసింది. 2016లో అమల, విజయ్ విడాకులకు దరఖాస్తు చేసుకోగా 2017 ఫిబ్రవరిలో వారికి విడాకులు మంజూరయ్యాయి. అయితే, సినిమా నటనను కొనసాగించాలన్న అమలా పాల్ నిర్ణయమే ఈ పెళ్లి పెటాకులు కావడానికి దారితీసిందంటూ అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. కాని, అవన్నీ నిజం కాదని ఎఎల్ విజయ్ తండ్రి ప్రముఖ నిర్మాత ఎఎల్ అళగప్పన్ ఇటీవల స్పష్టం చేశారు.
తన కుమారుడు విజయ్, అమల విడాకులు తీసుకోవడానికి కారణం ప్రముఖ నటుడు ధనుష్ అంటూ ఆయన కొత్త బాంబు పేల్చారు. ఇటీవల ఒక యుట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటరూలో అళగప్పన్ ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు జెఎఫ్డబ్లు మేగజైన్ రాసింది. అళగప్పన్ చెప్పడం ప్రకారం…విజయ్తో పెళ్లి జరిగిన వెంటనే నట జీవితానికి ఫుల్స్టాప్ పెట్టాలని అమల నిర్ణయించుకుందట. అయితే ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్బార్ ఫిల్మ్ నిర్మించనున్న అమ్మ కనక్కు(2016)లో నటించమని అమలకు ధనుష్ ఆఫర్ ఇచ్చాడట. అయితే ఈ చిత్రంలో నటించాలని అమల నిర్ణయించుకోవడంతో అది ఆమెకు, విజయ్కు మధ్య మనస్పర్థలకు దారితీసిందట. విడాకుల తర్వాత అమల తన నట జీవితాన్ని కొనసాగిస్తుండగా విజయ్ గత ఏడాది జూలైలో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తాను కూడా ద్వితీయ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అమలా పాల్ ఇటీవలే ఒక ఇంటర్వూలో వెల్లడించారు.