న్యూఢిల్లీ: పొరుగు దేశం అఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత సంక్షోభంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి అంశాలను రాజకీయ పార్టీల సభాపక్ష నేతలకు వివరించాలని ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ మంత్రిత్వశాఖకు సూచించారు. అఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ప్రాబల్యం చాటుకోవడంతో అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలు తలెత్తాయి. ప్రత్యేకించి అక్కడ ఇంకా మరికొందరు భారతీయులు చిక్కుపడి ఉన్నారు.
అంతర్యుద్ధ పరిస్థితి ముదిరిన ఆ దేశంలో వాతావరణం గురించి ప్రతిపక్ష నేతలకు తెలియచేయాలని ప్రధాని తెలిపినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం వివరించారు. కాబూల్ నుంచి ప్రతిరోజూ రెండు విమానాల ద్వారా అక్కడి భారతీయులను తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అక్కడి హిందువులు, సిక్కులను కూడా తీసుకువస్తామని, వారికి పూర్తి సాయంగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఈ నెల 26వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రతిపక్షాలతో ప్రభుత్వ అఖిలపక్ష భేటీ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ట్వీటు వెలువరించారు.
All-Party on Afghan on Thursday