Saturday, May 4, 2024

వనపర్తి జిల్లాలో మరో కొత్త రెవెన్యూ మండలం ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

ఏదుల గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ జారీ

మనతెలంగాణ/హైదరాబాద్:  వనపర్తి జిల్లాలో మరో కొత్త రెవెన్యూ మండలం ఏర్పాటుకానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వనపర్తి జిల్లాలోని మూడు మండలాల్లోని కొన్ని గ్రామాలను కలిపి ఏదుల గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయనున్నారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఈ నోటిఫికేషన్‌లో ఉత్తర్వులు జారీ చేశారు. 1974 నాటి జిల్లా ఫార్మేషన్ చట్టంలోని సెక్షన్-3లోని సబ్సెక్షన్ 5 కింద ఈరెవెన్యూ మండలం ఏర్పాటు ప్రక్రియను చేపట్టినట్టు ఆయన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఈ మండల ఏర్పాటుకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా, ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 15 రోజుల్లోగా అందజేయాలని ఆయన సూచించారు. వనపర్తి జిల్లాలోని రేవళ్లి మండలం నుంచి చెన్నారం, చీరకపల్లి గ్రామాలను, గోపాల్పేట మండలంలోని ఏదుల గ్రామాన్ని, నాగర్‌కర్నూల్ జిల్లా కోడేర్ మండలంలోని సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకులపల్లి గ్రామాలను కలిపి నూతన మండలంగా ఏర్పాటు చేస్తున్నారు. పైన పేర్కొన్న జిల్లాలు, మండలాలు, గ్రామాల ప్రజలు తమ అభ్యంతరాలు, సలహలు, సూచనలను 15 రోజుల్లో సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేయాలని నవీన్‌మిట్టల్ సూచించారు. కాగా, కొత్త రెవెన్యూ మండలంగా ఏర్పాటు కాబోతున్న ఏదుల గ్రామం ప్రస్తుతం వనపర్తి జిల్లాలోని వనపర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గోపాల్‌పేట్ మండలంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News