రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ : వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. 57 ఏళ్లు నిండిన వారందరికీ సోమవారం నుంచి ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆగస్టు 31తో దరఖాస్తు స్వీకరణ గడువు పూర్తయింది. కరోనా, వివిధ కారణాలతో పలువురు దర ఖాస్తులు చేసుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో పలువురు శాసనసభ్యులు ఇదే విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువచ్చారు.
వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుకు మరోసారి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన మేరకు సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. సబంధీకులు దగ్గరలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లి తగు ఆధారాలతో దరఖాస్తు చేయాలి. వయసు నిర్థరణకు పంచాయతీ, మున్సిపల్ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాలు, లేదంటే ఓటరు గుర్తింపు కార్డులో నమోదైన వయసును ఆధారంగా చూపాలి. దరఖాస్తుకు ఆధార్కార్డు, వయసు నిర్ధరణ పత్రం తో పాటు బ్యాంకు పాసు పుస్తకం, పాస్పోర్టు సైజు ఫోటోతో స్వయంగా దరఖాస్తుదారు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.