అధ్యక్షుడు మాక్రోన్ను దూషిస్తూ పోస్టర్లు
న్యూఢిల్లీ: ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ఒక మహిళతోసహా ముగ్గురిని ఒక తీవ్రవాది హతమార్చిన ఘటనను ఖండిస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మాక్రోన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముంబయి, భోపాల్లో ఆయనపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతూ పోస్టర్లు వెలిశాయి. నైస్లో జరిగిన హత్యాకాండను ఖండిస్తూ భారత్ ఫ్రాన్స్కు సంఘీభావం ప్రకటించిన మరుసటి రోజే ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్లు ప్రచురించే హక్కును సమర్థిస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ముంబయి, భోపాల్లో నిరసనలు వ్యక్తం కాగా మహమ్మద్ అలీ రోడ్లో వెలసిన పోస్టర్లను ముంబయి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం తొలగించారు. రోడ్డు పైన పడి ఉన్న పోస్టర్లపై నుంచి ప్రజలు నడుస్తున్న, కార్లు వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాగా.. ఈ నిరసనల వెనుక ముస్లిం సంస్థ రజా అకాడమీ ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.
ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్లో ఒక మహిళా టీచరును దారుణంగా తలనరికి చంపడం, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్పై వ్యక్తిగత దాడిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం ఖండించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్పై ఆమోదయోగ్యం కాని భాషలో దుర్భాషలాడుతూ వ్యక్తిగత దాడి జరపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధమని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.