హైదరాబాద్ : మద్యం షాపులో దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 26,000 విలువైన మద్యం బాటిళ్లు, రూ.50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ముషీరాబాద్, బాపూజీ నగర్కు చెందిన పెంచుక హిమేంద్ర అలియాస్ లడ్డు, అబ్దుల్ గఫర్ ఖాన్ ఇద్దరు చదువుకుంటున్నారు. లాక్డౌన్ కావడంతో బోయిగూడలోని శ్రీవెంకటేశ్వర వైన్స్ షటర్ పగులగొట్టి మద్యం చోరీ చేశారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు నిందితులు చోరీలు చేస్తున్నారు. ఇద్దరు వ్యసనాలకు బానిసలుగా మారారు, డబ్బులు లేకపోవడంతో చోరీలు చేయడం ప్రారంభించారు. ఈ విధంగానే వైన్స్ షాపు రూఫ్ను తొలగించి అందులోకి దూకి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. వాటిని అవసరం ఉన్న వారికి అధిక ధరలకు విక్రయించారు. గాంధీ నగర్ పరిసరాల్లో నిందితులు అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకుని విచారించగా విషయం బయటపడింది. టాస్క్ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ ఎండి అబ్దుల్ జావీద్, ఎస్సైలు శ్రీధర్, తదితరులు పట్టుకున్నారు.