నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు
55మందిని ముంచిన నిందితులు
అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ : రుణాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.18,000 నగదు, నకిలీ సర్టిఫికేట్ కాపీలు3, కంప్యూటర్, మూడు మొబైల్ ఫోన్లు, 20 సిమ్లు, 10 ఫోన్లు, మూడు చెక్బుక్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం, నేసపాకం తాలూక, భరత్నగర్కు చెందిన గోపికృష్ణ వెంకటకృష్ణ వాసు నగరంలోని తిరుమలగిరిలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. కడలూరు జిల్లా, వాడకొత్తు పోస్టు, గాంధీ గ్రామానికి చెందిన నటరాజన్ ఆర్ముగం వ్యాపారం చేస్తున్నాడు. తిరుమలగిరిలో నకిలీ కాల్ సెంటర్ యునైటెడ్ ఇండియా హెల్త్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామని చెప్పి పలువురికి ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసేందుకు టెలీకాలర్లను నియమించుకుని అమాయకులకు వల వేస్తున్నాడు.
వీరి మాటలు నమ్మిన వారి వద్ద నుంచి రూ.5,000 నుంచి రూ.10,000 వసూలు చేస్తున్నారు. తక్కువ డబ్బులకు ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. ప్రైవేట్ డాటా ఆపరేటర్ల నుంచి కస్టమర్ల డేటాను తీసుకుని ఫోన్లు చేస్తున్నారు. డబ్బులు రాగానే వాటిని తమ పర్సనల్ బ్యాంక్ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత ఇక్కడి నుంచి మాయం అయ్యేందుకు ప్లాన్ వేసుకున్నారు. గోపికృష్ణ వెంకటకృష్ణ వాసు గతంలో కూడా తమిళనాడులో 2015, 2016, 2019లో ఇలాగే కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామని చెప్పి మెసం చేశాడు. దీంతో పోలీసులు అరెస్టు చేసి పిడి యాక్ట్ పెట్టారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత నగరానికి మకాం మార్చి ఇక్కడ నేరాలు చేస్తున్నాడు. ఇన్స్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీకాంత్, పరమేశ్వర్, శివానందం, అశోక్ రెడ్డి తదితరులు పట్టుకున్నారు.