Monday, May 6, 2024

జూబ్లీహిల్స్ సీటుపై అజారుద్దీన్, విష్ణు మధ్య రచ్చ(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆకాంక్షను మాజీ క్రికెటర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టిపిసిసి) వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజారుద్దీన్ వ్యక్తం చేశారు. బుధవారం నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.

పార్టీ టికెట్ ఇస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీచేయవచ్చు. నాకు పార్టీ టికెట్ ఇస్తే ఇక్కడి నుంచే పోటీ చేస్తాను. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలన్న ఆకాంక్షను ఇప్పటికే పార్టీ అధిష్టానానికి చెప్పాను. పార్టీ టికెట్ కోసం ఎవరైనా కోరవచ్చు. తుది నిర్ణయం పార్టీ అధిష్టానానిదే అని మీడియాతో మాట్లాడుతూ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అప్పట్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ 2014లో రాష్ట్ర విభజన అనంతరం బిఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు. 2009, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పి విష్ణువర్ధన్ రెడ్డిపై మాగంటి గోపీనాథ్ గెలుపొందారు.

కాంగ్రెస్ దివంగత ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి కుమారుడైన విష్ణువర్ధన రెడ్డి తన తండ్రి మరణానంతరం మొదటిసారి 2007ఉప ఎన్నికలో ఖైతరాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. నియోకవర్గ పునర్విభజన అనంతరం జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

కాగా..బుధవారం అజారుద్దీన్ వ్యాఖ్యల అనంతరం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి, అజారుద్దీన్ అనుచరుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News