Saturday, April 27, 2024

బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు..

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : బిజెపి కార్యకర్తల జోష్ చూసిన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నాయని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారంలో ఉన్నన్నాళ్లు కెటిఆర్ బిజెపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా భరించారని, కొిట్లాడారని జైలుకు వెళ్లారని, మీ పోరాటానికి హ్యాట్సాఫ్’ అని పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాలులో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి హాజరైన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ రానున్నారని తెలిపారు. ఆరోజు నిర్వహించే క్లస్టర్ సమావేశానికి ఆయన హాజరుకానున్నారని తెలిపారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రియాశీల కార్యకర్తలతో నిర్వహించే సమ్మేళనంలో ప్రసంగించనున్నారని అన్నారు.

ఈ సమ్మేళనంలో ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలోని 20 మంది కార్యకర్తల చొప్పున పార్లమెంట్ పరిధిలో దాదాపు 40 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పార్టీ నేతలను సమాయాత్తం చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ అంతర్గత సమావేశానికి దాదాపు 700 మంది మంది నాయకులు హాజరయ్యారు. వీరిలో ఒక్కొక్కరిని ఒక్కో ఎంపిటిసి ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి సమన్వయకర్తలుగా నియమించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమకు అప్పగించిన గ్రామాల్లో కార్యకర్తలను సమన్వయం చేయడంతోపాటు అత్యధిక ఓట్లు సాధించి గెలుపే లక్ష్యంగా చేసుకుని పనిచేయనున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

కేంద్రంలో మళ్లీ వచ్చేది మోదీ సర్కారే
కేంద్రంలో మళ్లీ వచ్చేది మోదీ సర్కారేననే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. రాష్ట్రంలోనూ బిజెపి నుండి అత్యధిక మంది ఎంపిలు గెలిస్తేనే తెలంగాణకు అదనపు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే మోదీతోనే సాధ్యమనే భావన కాంగ్రెస్, బిఆర్‌ఎస్ శ్రేణుల్లో నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓటేస్తామని ఆ పార్టీల కార్యకర్తలు కూడా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తరువాత ఏనాడూ ఖాళీగా కూర్చోలేదని, కార్యకర్తలు తలెత్తుకుని కాషాయ జెండా పట్టుకుని తిరిగేలా పోరాటాలు చేశానని అన్నారు. కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్, మోదీ చేసిందేమిటని కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు పస లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఎంపిగా దాదాపు 10 వేల కోట్ల నిధులు తెచ్చా
ఎంపిగా గెలిచాక దాదాపు 10 వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చిందనే పూర్తి వివరాలను వెల్లడించడంతోపాటు అతి త్వరలో గ్రామ గ్రామాన ఈ మేరకు ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతల నోళ్లు మూయిస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, గంగాడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, రాష్ట్ర నాయకులు మీసాల చంద్ర య్య, క్రిష్ణారెడ్డి, చెన్నమనేని వికాస్ రావు, ఆరెపల్లి మోహన్, బాస సత్యనారాయణ, బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News