బంగ్లాదేశ్ సంచలనం.. కివీస్పై తొలి టి 20 సిరీస్ విజయం
ఢాకా: న్యూజిలాండ్తో జరుగుతున్న టి20 సిరీస్లో ఆతిథ్య బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా జరిగిన నాలుగో టి20 మ్యాచ్లో పర్యాటక జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న బంగ్లా జట్టు మొట్టమొదటిసారి కివీస్పై టి20 సిరీస్ను గెలుచుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బంగ్లా బౌలర్లు నసుమ్ అహ్మద్( 4/10), ముస్తాఫిజుర్ (4/12) ధాటికి 19.3 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. విల్ యంగ్ (46), కెప్టెన్ లాథమ్(21) రెండంకెల స్కోరు చేయడంతో కివీస్ ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష ఛేదనలో బంగ్లాదేశ్ సైతం ఆరంభంలో తడబడినప్పటికీ కెప్టెన్ మహమ్మదుల్లా(48 బంతుల్లో 43 నాటౌట్) చివరిదాకా క్రీజ్లో నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
అతనికి ఓపెనర్ మహమ్మద్ నయీమ్ (35 బంతుల్లో 29) చక్కటి సహకారం అందించాడు. దీంతో బంగ్లా జట్టు 19.1 ఓవర్లలో లక్షాన్ని ఛేదించింది. కివీస్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ 2, కోల్ మెక్ కొన్చి ఒక వికెట్ పడగొట్టారు. కెరీర్ బెస్ట్ గణాంకాలతో కివీస్ నడ్డి విరిచిన నసుమ్ అహ్మద్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో బంగ్లా గెలుపొందగా మూడో మ్యాచ్లో కివీస్ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి మ్యాచ్ ఈ నెల 10న ఇదే వేదికగా జరుగుతుంది.
Bangladesh won T20 Series by 3-1 against Kiwis