Saturday, May 4, 2024

కివీస్ సిరీస్‌కు రోహిత్ సేన ఎంపిక.. కోహ్లీకి విశ్రాంతి

- Advertisement -
- Advertisement -

రోహిత్ సారథ్యంలో కివీస్ సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. కోహ్లీకి విశ్రాంతి
వెంకటేశ్, హర్షల్ పటేల్‌లకు చోటు 
కివీస్ సిరీస్‌కు టీమిండియా ఎంపిక
ముంబై: న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగే ట్వంటీ20 సిరీస్ కోసం టీమిండియాను భారత క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వైస్ కెప్టెన్‌గా కెఎల్.రాహుల్‌ను నియమించింది. ఇక సీనియర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, బుమ్రా, షమి, హార్దిక్ తదితరులకు విశ్రాంతి ఇచ్చారు. న్యూజిలాండ్‌తో భారత్ మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 17 నుంచి ఈ సిరీస్ ఆరంభమవుతోంది. మరోవైపు ఐపిఎల్‌లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌లకు టీమిండియాలో చోటు కల్పించారు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు విశ్రాంతి కల్పిస్తారని భావించినా అతన్ని సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇషాన్ కిషన్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. సీనియర్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్‌లు కూడా సిరీస్‌కు ఎంపికయ్యారు.

ఇక వరల్డ్‌కప్‌కు దూరంగా ఉన్న దీపక్ చాహర్, యజువేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్‌లు తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా జట్టులో స్థానం సంపాదించాడు. ఊహించినట్టే హార్దిక్ పాండ్యను సిరీస్‌కు దూరంగా ఉంచారు. ఇక కోహ్లి విశ్రాంతి కావాలని కోరడంతో అతన్ని సిరీస్‌కు ఎంపిక చేయలేదు. జడేజా, షమి, బుమ్రాలకు కూడా విశ్రాంతి ఇచ్చారు. కాగా, సంజు శాంసన్, పృథ్వీషా, శిఖర్ ధావన్ తదితరులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. వీరికి బదులు యువ ఆటగాళ్లు వెంకటేశ్, రుతురాజ్ తదితరులు టీమిండియాలోకి వచ్చారు. కొత్తగా అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్‌లు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టులో తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపర్‌గా జట్టులో స్థానం సంపాదించాడు. ఈ సిరీస్ ద్వారా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్.రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్.

BCCI Announces Team for T20 Squad against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News