కోల్కతా: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా.. ఆమె ప్రతిఘటించి నిందితుల్లో ఒకరి నాలుకను కొరకడంతో రెండు భాగాలైన సంఘటన పశ్చిమ బెంగాల్లో జల్పాయిగురి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాహర్పూర్ అనే గ్రామంలో 65 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. రాకీ మహ్మాద్, చోటు మహ్మాద్ అనే వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేస్తుండగా ఆమె కేకలు వేసింది. రాకీ తన నోరు ఆమె నోరును మూయడానికి ప్రయత్నించినప్పుడు అతడి నాలుకను గట్టిగా కొరికింది. దీంతో రాకీ నాలుక రెండు భాగాలుగా విడిపోయింది. గ్రామస్థులు అక్కడి చేరుకునేసరికి చోటు తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన రాకీని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి నాలుక అతుక్కోవటం కష్టమేనని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.