హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డు గ్రహీతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన పివి సింధు బ్యాడ్మింటన్ క్రీడతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గొప్ప పేరు తెచ్చిందని ప్రశంసించారు. పివి సింధుకు అవార్డు రావడం మరింత మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తోందని ప్రశంసించారు. పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన కరీంనగర్కు చెందిన శ్రీ భాష్యం విజయసారథికి ఫోన్లో కెటిఆర్ అభినందనలు తెలిపారు. విజయ సారథి చేసిన సాహిత్య కృషికి దక్కిన గుర్తింపు అని కొనియాడారు. పద్మ శ్రీ అవార్డు దక్కిన హైదరాబాద్కు చెందిన చింతల వెంకట్రెడ్డికి ఫోన్లో అభినందనలు తెలిపారు. ద్రాక్ష పంట సాగులో వినూత్నమైన మెలుకువలతో అద్భుతమైన వ్యవసాయ విధానాలతో గొప్ప దిగుబడులు సాధించిన వ్యక్తి వెంకట్ రెడ్డి అని ప్రశంసించారు. రైతుకు పద్మ శ్రీ అవార్డు దక్కడం పట్ల కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు.